గొప్ప నాగరికత, సంస్కృతిని కలిగిన ప్రాంతం అది..ఒకప్పుడు నీటి వనరులకు కొరతలేని ప్రాంతం అది..ఇప్పుడు నీళ్లు లేవు.. వర్షాలున్నా ఒడిసిపట్టే ప్లాన్ లేదు..పీడిస్తున్న నిరుద్యోగం, వలసలు.. పట్టని ప్రభుత్వాలు..ఇదీ బుందేల్ఖండ్ పరిస్థితి.. వీరి బాధ పట్టదెవరికీ!
భోపాల్, ఆగస్టు 1: అటు ఉత్తరప్రదేశ్లో సగభాగం.. ఇటు మధ్యప్రదేశ్లో మరో సగం.. రెండు రాష్ర్టాల మధ్య అటూ, ఇటూ కాకుండా పోతున్నది బుందేల్ఖండ్. ఈ ప్రాంతం పేరెత్తితే చాలు.. వలసలు, నీటి కొరత గుర్తుకొస్తాయి. వాస్తవానికి ఈ ప్రాంతం గొప్ప నాగరికత, సంస్కృతికి నెలవు. ఖనిజ సంపదకు నిలయం. కానీ, నీటి సమస్యే ఇక్కడి ప్రజలకు శరాఘాతంగా మారింది. వర్షాలు పడితేనే వ్యవసాయం సాగుతుంది.
ఈ ప్రాంతంలోని 13 జిల్లాల (యూపీలో 7, మధ్యప్రదేశ్లో 6) పరిస్థితి ఇంతే. ఒకప్పుడు ఇక్కడ నీటి వనరులకు కొదవ లేదు. రానురానూ పరిస్థితి దారుణంగా తయారైంది. బీజేపీ పాలిస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నీటి సంరక్షణకు ఏ చొరవా తీసుకోలేదు. వర్షాలు పడ్డా, నీటి చుక్కను ఒడిసిపట్టే ప్రణాళికలు రచించలేదు. దీంతో ఈ ప్రాంతం కరువుతో అల్లాడుతున్నది. ఆ కరువుతోనే కాటికి ఎదురుచూడలేక.. లక్షల మంది ప్రజలు కుటుంబాలతో సహా వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు. సాధారణం కంటే సెప్టెంబర్లో 25 శాతం మంది అధికంగా వలసబాట పడుతారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ ఉపాధి దొరికే పరిస్థితులు కూడా లేవని పేర్కొన్నారు.
పాలించేది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లే!
డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీ.. ఈ రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నది. కానీ, తమను పట్టించుకొన్న పాపాన పోలేదని బుందేల్ఖండ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి గానీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ ఎలాంటి సహాయం అందటం లేదని, కనీసం ఉపాధి చూపించే పరిస్థితులు లేవని వాపోతున్నారు. ‘ఈ ప్రాంతానికి యూపీఏ సర్కారు రూ.7,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కానీ, దానితో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. బుందేల్ఖండ్ నుంచి వలసలు ఆపాలంటే వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేయాల్సిందే’ అని ఆ ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు వెల్లడించారు.