Milk | శ్వేత విప్లవంతో 1970లో పాల ఉత్పత్తిలో అసాధారణ ప్రస్థానం మొదలుపెట్టిన మనదేశం.. అనతికాలంలోనే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరింది. వర్గీస్ కురియన్ పుణ్యమా అని లక్షల మంది రైతుల ఆదాయాలు పెరిగాయి. పౌష్టికాహారమైన పాలు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. పాడి పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. రోజుకు 50 కోట్ల లీటర్లకుపైగా పాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. పాల ఉత్పత్తులు కూడా పెరిగాయి.
2014 తర్వాత పాడి పరిశ్రమపై భారత ప్రభుత్వ నిర్లక్ష్యం మొదలైంది. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటే పాడి పశువుల దాణా ఖర్చులు అమాంతం పెరగడం, లంపీ స్కిన్ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందటంతో పాల ఉత్పత్తిలో పెరుగుదల ఆగిపోయింది. ఇదే సమయంలో పాలు, పాల ఉత్పత్తులకు ఏటా 10 శాతం డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీంతో నేడు దేశంలో పాలు దొరకని పరిస్థితి వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసిన దేశం నేడు విదేశాల నుంచి పాల ఉత్పత్తులైన పాలపొడి, వెన్న, నెయ్యి, చీజ్ వంటి సరుకులను దిగుమతి చేసుకొనే దుస్థితికి దిగజారింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: వంటనూనె ధర మండుతున్నది.. బియ్యం, పప్పులు ఉడుకుతనేలేవు.. కుటుంబంలో కష్టపడి పనిచేసేవాళ్లు మూడుపూటలా కడుపునిండా తినటానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడిక ఇంట్లోని పిల్లలకు పాలు కొందామన్నా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఒక సామాన్య కుటుంబంపై నలువైపుల నుంచీ దాడి చేస్తున్నది. వీటిలోకి ఇప్పుడు పాలు, పాల ఉత్పత్తులు వచ్చిచేరాయి. ఏడాది వ్యవధిలోనే దేశంలో పాల ఉత్పత్తుల ధరలు ఏకంగా 12-15 శాతం పెరిగాయి. వెన్న, నెయ్యి, పాలపొడి వంటి ఉత్పత్తులు మరికొద్ది నెలల్లో దుకాణాల్లో దొరక్కపోవచ్చని డెయిరీ పరిశ్రమ వర్గాల ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇన్నాళ్లూ మొద్దు నిద్రపోయిన మోదీ సర్కారు, పరిశ్రమ హెచ్చరికలతో ఇప్పుడు కండ్లు నులుముకొని నష్టనివారణ చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వెన్న, నెయ్యి, పాలపొడి వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర పశుసంవర్ధక, డెయిరీ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ బుధవారం ప్రకటించారు.
దేశంలో పాల ధరలు రోజురోజుకూ ఎగబాకుతూనే ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో లీటర్ టోన్డ్ మిల్క్ ధర రూ.48 ఉండగా, 2023 ఫిబ్రవరి నాటికి రూ.56- 59 వరకు పెరిగింది. అంటే ఏడాది వ్యవధిలోనే లీటర్పై దాదాపు రూ.10 వరకు పెరిగింది.
గత ఏడాది కాలంగా దేశంలో ప్రాణాంతక లంపీ స్కిన్ వ్యాధి విజృంభిస్తున్నది. ఉత్తరాది రాష్ర్టాల్లో ఈ వ్యాధిబారిన పడి 1,89,000 పాడి పశువులు మరణించాయని కేంద్ర డెయిరీ శాఖ కార్యదర్శే స్వయంగా వెల్లడించారు. తమ పశువులను కాపాడుకొనేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పాడి పశువులకు అత్యంత అవసరమైన దాణా ధరలు కూడా ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయని పరిశ్రమవర్గాలు, రైతులు అంటున్నారు. పాల ఉత్పత్తిలో వచ్చే ఆదాయంలో 70-80 శాతం దాణాకే ఖర్చుపెట్టాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. ఉత్తరాదిలో ఇటీవలి కాలంలో అకాల వర్షాలు పెరగటం కూడా పాల దిగుబడిపై ప్రభావం చూపిందని రాజేశ్కుమార్ తెలిపారు.