హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. అనుమతులు లేకున్నా, ట్రిబ్యునళ్లు నీటి కేటాయింపులు చేయకున్నా, పొరుగు రాష్ర్టాలు అభ్యంతరాలు తెలుపుతున్నా.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రమైతే చాలు, ఆ సాగునీటి ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపేస్తుంది. కర్ణాటక చేపట్టిన అప్పర్భద్ర ప్రాజెక్టే ఇందుకు సాక్ష్యం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి ఇచ్చిన సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పర్భద్ర ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నాయని, రైపేరియన్ రాష్ర్టాల అనుమతి ఉందంటూ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చి పార్లమెంట్ను పక్కదోవపట్టించారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, కవిత, వెంకటేష్ నేత ఇవే అంశాలను లేవనెత్తినప్పుడూ మంత్రి ఇదే సమాధానమివ్వడం గమనార్హం.
నీటి కేటాయింపులు లేకున్నా..
అప్పర్భద్ర, అప్పర్తుంగ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలంటూ కర్ణాటక ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్-1 ఎదుట ప్రతిపాదించింది. అయితే కృష్ణా బేసిన్ తీవ్ర నీటి లోటు ఉన్న బేసిన్ అని, కృష్ణాకు తుంగభద్ర బేసిన్ నుంచే నీరు రావాల్సి ఉందని, తుంగభద్రపై ప్రాజెక్టులను నిర్మిస్తే కృష్ణాకు నీటి రాక తగ్గిపోతుందని, ఫలితంగా దిగువనున్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అప్పర్భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్-1 ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. ఆ తర్వాత బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ 2 కేటాయింపు చేసినా సుప్రీంకోర్టులో పిటిషన్ కారణంగా ఈ అవార్డు అమల్లోకి రాలేదు. అయినప్పటికీ ట్రిబ్యునల్ 1 అప్పర్భద్ర ప్రాజెక్టుకు నీటిని కేటాయించిందని, ఆ మేరకే కర్ణాటక ప్రభుత్వం పనులను చేపట్టిందని కేంద్ర మంత్రి ప్రకటించడం
గమనార్హం.
అంతర్రాష్ర్టాల అభ్యంతరాలు బుట్టదాఖలు
ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే రైపేరియన్ రాష్ర్టాల అంగీకారం తప్పనిసరి. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా సొంతంగా అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు కర్ణాటక నీటి కేటాయింపులు చేసుకుంది. నిలదీయాల్సిన కేంద్రం ఆ పని చేయకపోగా, ఏకంగా అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం బీజేపీ పక్షపాత వైఖరికి నిదర్శనం. ఏపీ, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై సమాచారాన్ని ఇరు రాష్ర్టాలకు అందించామంటూ కేంద్రం మరో పచ్చి అబద్ధాన్ని వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా అప్పర్భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరుపై సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)ను గతంలో తెలంగాణ సర్కారు నిలదీసింది. అనుమతులు నిలిపేయాలని డిమాండ్ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్టు అప్రయిజల్(సౌత్) డైరెక్టరేట్కు అనేక లేఖలు రాసింది. ఇప్పటికీ తెలంగాణ లేవనెత్తిన ఏ అంశంపైనా కేంద్రం, సీడబ్ల్యూసీ నుంచి జవాబు రాలేదు. అయినప్పటికీ అన్ని రైపేరియన్ రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపామని, ఆ తరువాతనే అనుమతులిచ్చామని, అసలు రైపేరియన్ రాష్ర్టాల అనుమతే అక్కరలేదని కేంద్రమంత్రి పార్లమెంటులో చెప్పారు.