‘రాజకీయాల్లో సంకీర్ణ కూటమి అనేది షరతులతో కూడిన, గణనకు రాని ప్రయాణం. అది ఎప్పుడు కూలుతుందో తెలియని ఓ నిర్మాణం. విస్తృతస్థాయి అంశాలు, సమస్యల భారం మోపబడ్డ ఓ డొల్ల, అస్థిర సాధనం’.
– ఎహసాన్ సెహగల్,
(డచ్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు)
Opposition Meet | హైదరాబాద్, జూన్ 23 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనే లక్ష్యంతో పాట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల భేటీకి సరిగ్గా అద్దం పడుతున్న వ్యాఖ్యలు ఇవి. బీజేపీని గద్దె దింపడానికి విపక్షాలకు ఒక ఎజెండా, ఉమ్మడి ప్రణాళిక, వ్యూహం ఏదీ లేదన్న డొల్లతనం ఈ భేటీ జరిగిన తీరును చూస్తే అర్థమవుతుంది. బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్(యునైటెడ్) అధినేత నితీశ్కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటు 16 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. బీజేపీని ఎదుర్కోవాలన్న లక్ష్యం, పట్టుదల, చిత్తశుద్ధి అసలు విపక్షాలకు ఉందా? అనే అనుమానం ఈ భేటీలోనే వ్యక్తమైంది. ఒక లక్ష్యమంటూ లేకుండా ఈ తొలి సమావేశం మొక్కుబడిగా ముగిసింది. వచ్చే నెల మొదటి వారంలో సిమ్లాలో మలి భేటీ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే మలి భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహిస్తారని తెలిపారు. దీంతో విపక్షాల ఐక్యతా రాగం అన్నది ఉత్తదేనని తేలిపోయింది.
దీని వెనుకాల ఉండి పెద్దన్న పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్సేనన్నది తేలిపోయింది. వాస్తవానికి కాంగ్రెస్ వైఫల్యం వల్లనే దేశంలో బీజేపీ ఆడిందే ఆట… పాడిందే పాటగా మారింది. పిల్లి మెడలో గంట కట్టడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విఫలం కావడం వల్లనే బీజేపీ బలపడింది. అలాంటప్పుడు కాంగ్రెస్ సారథ్యంలో మున్ముందు విపక్షాల ఐక్యత అనేది ఏ మేరకు ఫలిస్తుందన్నదే అసలు ప్రశ్న. విపక్షాల ఐక్యతకు గండి కొట్టడంలో అసలు దోషి, అడ్డంకి కాంగ్రెస్ పార్టీనేనని ఈ భేటీకి హాజరైన పార్టీలు దుమ్మెతి పోశాయి. కాంగ్రెస్ పార్టీకి విపక్షాల ఐక్యతపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ అధికార యంత్రాంగంపై కేంద్రానికి పెత్తనం అప్పగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తామని ఆ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుందని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కెజ్రీవాల్ నిలదీస్తే సమాధానం చెప్పలేకపోయింది.
ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాడుతామని హామీ ఇస్తేనే పాట్నా భేటీకి వస్తామని ఆప్ ఇంతకు ముందే స్పష్టంగా చెప్పింది. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా 11 పార్టీలు కేజ్రీవాల్కు మద్దతు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయలేకపోయింది. పైగా అది పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు ఆలోచిస్తామంటూ కాంగ్రెస్ దాట వేసింది. విపక్షాల కూటమిలో చిత్త శుద్ధితో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ కప్పదాటు వైఖరి ప్రదర్శించింది. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కారణంగానే కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి ఈ విధంగానే కొనసాగితే సిమ్లాలో జరిగే మలి భేటీకి తాము హాజరయ్యే ప్రసక్తే లేదని ఆప్ ఖరాకండీగా తేల్చి చెప్పింది.
ఎవరి షరతులు వారివి..
పశ్చిమ బెంగాల్లో తమకు వ్యతిరేకంగా సీపీఎంతో జత కట్టమన్న విషయాన్ని కాంగ్రెస్ స్పష్టం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాట్నా భేటీకి ముందే డిమాండ్ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ తన వైఖరిని చెప్పలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో బీజేపీకి పరోక్షంగా బలం చేకూర్చే విధంగా కాంగ్రెస్ వ్యవహరించడం వల్లనే తాను విపక్షాల భేటీకి దూరంగా ఉన్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మయావతి స్పష్టం చేసింది. దీనికీ కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోయింది. బీజేపీని ఓడించడానికి విపక్షాల మధ్య ఐక్యతా ఉండాలని చెప్పే కాంగ్రెస్, తమ చిత్తశుద్ధిని శంకించే ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో బీజేపీపై పోరుకు కాంగ్రెస్ కలిసి రాదన్నది విపక్షాల తొలి భేటీలో తేలిపోయింది.
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి, ప్రధాన ప్రతిపక్షంగా తన అసమర్థతను పలు సందర్భాలలో బయటపడటం వల్లనే ఆ పార్టీ నేతృత్వంలో విపక్షాల భేటీ అనేది వృథా ప్రయాసన్న అంచనాతోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పాట్నా సమావేశానికి దూరంగా ఉన్నారా? అని అనిపిస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం రావాలి తప్ప ఈ టెంట్లు, ఫ్రంట్ల వల్ల అయ్యేపని కాదని ముందునుంచి కేసీఆర్ చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కలిగిన ప్రత్యామ్నాయ అజెండా ఉండాలని, ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదని కేసీఆర్ అన్న మాటలు అక్షర సత్యమని విపక్షాల భేటీ తర్వాత తేలిపోయింది. పార్టీలు కాదు ప్రజలు గెలవాలన్న కేసీఆర్ ఆకాంక్షను; నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి లాంటి సమస్యలను విపక్షాలు పట్టించుకోవడం లేదనే విషయం పాట్నా సమావేశం తీరుతెన్నులను పరిశీలిస్తే తెలిసిపోయింది!