దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోని, మణిపూర్ సంక్షోభంపై మాట మాట్లాడని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానాన్ని అనుమతించిన లోక్సభ స్పీకర్.. పార్టీలతో చర్చించి, చర్చకు తేదీని వెల్లడిస్తానని ప్రకటించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్షాలు.. కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీయనున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇది రెండో అవిశ్వాస తీర్మానం కావడం గమనార్హం.
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్నది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ‘అన్ని పార్టీల నేతలతో చర్చించి, తీర్మానంపై చర్చకు తేదీని ప్రకటిస్తాను’ అని వెల్లడించారు. బుధవారం ఉదయం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్కు సమర్పించాయి. బీఆర్ఎస్ తరపున ఎంపీ నామా నాగేశ్వరరావు నోటీసు అందజేశారు. రూల్ 198 కింద కాంగ్రెస్ లోక్సభాపక్ష ఉప నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానం ప్రవేశపెట్టగా నిబంధనల ప్రకారం 50 మందికి పైగా సభ్యులు మద్దతు తెలిపారు. దీనిపై 10 రోజుల్లోగా చర్చించాల్సి ఉంటుంది.
మణిపూర్పై నోరు తెరవని మోదీ
మణిపూర్ హింసాకాండ అంశంపై ప్రధాని మోదీ నోరు మెదపని నేపథ్యంలో విపక్షాలు అవిశ్వాస తీర్మాన అస్ర్తాన్ని ప్రయోగించాయి. ఈ విధంగానైనా సభలో ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశం వస్తుందన్న వ్యూహంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఓవైపు మణిపూర్లో హింసాకాండ, మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటుంటే.. ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై దాదాపు వారం కావస్తున్నా మణిపూర్తో పాటు ఇతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రాకుండా, ఉభయ సభలను వాయిదాల పర్వంలో నడిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని పార్లమెంట్ వేదికగా ఎండగట్టేందుకు విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. 84 రోజులుగా మణిపూర్ మండిపోతున్నా.. మోదీ మాట్లాడట్లేదని, అవిశ్వాస తీర్మానానికి ఆయన వివరణాత్మక స్పందన ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు.
మోదీ సర్కార్పై రెండోసారి అవిశ్వాసం
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2018, జూలై 20న ప్రతిపక్షాలు మొదటిసారి అవిశ్వాసం పెట్టాయి. అయితే లోక్సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో అది వీగిపోయింది. ప్రసుత్తం 543 మంది సభ్యులు గల లోక్సభలో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 330 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్తో కూడిన విపక్ష కూటమికి 140 మంది ఎంపీల మద్దతు ఉన్నది. ఈ రెండు గ్రూపుల్లో లేని ఇతర పార్టీలకు 60 మంది ఎంపీలు ఉన్నారు.
దేశ చరిత్రలో 27 సార్లు
దేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వంపై 27 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. తాజా అవిశ్వాస తీర్మానం 28వది అవుతుంది. సభలో బలాన్ని నిరూపించుకొనే క్రమంలో ‘విశ్వాస తీర్మానం’పై జరిగిన ఓటింగ్లో ఓడిపోయి.. 1990లో వీపీ సింగ్, 1997లో హెచ్డీ దేవెగౌడ, 1999లో ఏబీ వాజపేయీ ప్రభుత్వాలు కూలిపోయాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. 1979లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగకుండా ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు.
రాజ్యసభలో విపక్షాల వాకౌట్
మణిపూర్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం కూడా దద్దరిల్లాయి. మణిపూర్పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు నినాదాలు చేశారు. చర్చకు అనుమతించకపోవడంతో నిరసనగా విపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. మణిపూర్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఐదు రోజుల తర్వాత కూడా మోదీ సభకు రాకపోవడాన్ని తప్పుబట్టారు. లోక్సభలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ముందుగా కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు సభ నివాళులర్పించింది. అనంతరం మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మణిపూర్పై చర్చ చేపట్టాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో సభ రెండుసార్లు వాయిదా పడింది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అరు బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిల్లో అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును ఆమోదించుకొన్న అనంతరం.. స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. మణిపూర్తో పాటు ఇతర సమస్యలపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్కు రావాలని విపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిర్ణయించుకొన్నారు.