కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళనతో సోమవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును తీవ్రంగా ఖండించారు. నల్లచొక్కాలు, కండువాలు ధరించి పార్లమెంట్కు హాజరైన విపక్ష ఎంపీలు.. వెల్లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. లోక్సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ వైపు పేపర్లు, కండువాలు విసిరారు. విపక్షాల ఆందోళన నడుమే బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు వాయిదా అనంతరం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ)/ న్యూఢిల్లీ: బీఆర్ఎస్తో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో సోమవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలనే డిమాండ్ను కొనసాగించడంతో పాటు రాహుల్పై అనర్హతను సభ్యులు తీవ్రంగా నిరసించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నల్ల అంగీలు, కండువాలు ధరించి కేంద్ర అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిపై నిరసన తెలిపారు. లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలంతా ప్లకార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున ఆందోళన చేశారు. ఉభయ సభల్లో వెల్లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. లోక్సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ చైర్ వైపుగా పేపర్లతో పాటు నల్ల కండువాలు విసిరారు. కొనసాగిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి..
ప్రతిపక్షాలు సోమవారం ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’ను పాటించాయి. అదానీ వ్యవహారంతో పాటు రాహుల్ అనర్హత వేటు అంశంపై ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ‘సత్యమేవ జయతే’ అనే పెద్ద బ్యానర్తో నిరసన మార్చ్ చేపట్టారు. ‘సేవ్ డెమోక్రసీ(ప్రజాస్వామ్యాన్ని కాపాడండి)’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గత కొన్నేండ్లలోనే అదానీ సంపద అన్ని రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.
అదానీ వ్యాపార వ్యవహారాలపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ను అప్రతిష్ఠ పాల్జేసేందుకు.. కర్ణాటకలో చేసిన వ్యాఖ్యల కేసును గుజరాత్కు బదిలీ చేయించారని ఆరోపించారు. ఆందోళనలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, పీ రాములు, కేఆర్ సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, బోర్లకుంట వెంకటేష్ నేత, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
విపక్ష ఎంపీల సమావేశం
అంతకుముందు ఖర్గే చాంబర్లో విపక్షాలు భేటీ అయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు తదితర పార్టీల ఎంపీలు సమావేశమై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సాయంత్రం ఖర్గే నివాసంలో జరిగిన డిన్నర్ భేటీకి 18 విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. సావర్కర్పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తమ పార్టీ నుంచి ఎవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తి
2023-24 బడ్జెట్కు పార్లమెంట్ ఆమో దం తెలిపింది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)కి సంబంధించి ఒక సవరణతో కూడిన బిల్లుకు రాజ్యసభ సోమవారం ఎటువంటి చర్చ లేకుండా మూజవాణి ఓటుతో ఆమోదం తెలిపి తిరిగి లోక్సభకు పంపింది. అనంతరం లోక్సభ కూడా ఆమోదం తెలుపడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. విపక్షాల ఆందోళన నడుమే బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ప్రజాస్వామ్యం ఖూనీ
కేంద్రం ఫాసిస్టు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు విమర్శించారు. కొన్నేండ్ల వ్యవధిలోనే అదానీ లక్షల కోట్లకు ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. ఏ చట్టం ఆధారంగా అదానీకి పోర్టులు, ఎయిర్పోర్టులు కట్టబెట్టారో జేపీసీతో తేలుతుందన్నారు. చట్ట విరుద్ధంగా రాహుల్పై అనర్హత వేటు వేశారన్నారు. తాను ఆలిండియా బీసీ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నానని, మోదీ అనేది ఇంటి పేరు మాత్రమే అని, బీసీ సామాజికవర్గం పేరు కాదని ఆయన తెలిపారు.
ప్రజలంతా ఏకమై కేంద్రానికి బుద్ధి చెప్పాలి
ప్రజలంతా ఏకమై కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఓ వైపు దేశంలో నెలకొన్న ధరాఘాతం, నిరుద్యోగం, వంటి సమస్యలను కేంద్రం పట్టించుకోకుండా.. ఆయా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. మతం, కులాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతును బీజేపీ సర్కార్ నొక్కేస్తున్నదని విమర్శించారు.