Manipur | న్యూఢిల్లీ, ఇంఫాల్, జూన్ 24: కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేందుకు కేంద్రం శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్పీపీ, ఏఐడీఎంకే, డీఎంకే, బీజేడీ, ఆప్, ఆర్జేడీ, శివసేన (యూబీటీ) ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరపున ఎంపీ బీ వినోద్ హాజరయ్యారు.
ప్రధాని మోదీ లేకుండా ఈ సమావేశాన్ని నిర్వహించడం వల్ల ఉపయోగమేముందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఘర్షణలు తీవ్రమైన 50 రోజుల తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడంలో అర్థమేమిటని విపక్షాలు నిలదీశాయి. మణిపూర్లో హింస ను అరికట్టడంలో విఫలమైన ఆ రాష్ట్ర సీఎంను పదవి నుంచి తొలగించాలని సీపీఎం డిమాండ్ చేసింది. మరోవైపు ఈ సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించకపోవడంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా మండిపడ్డారు.
రాష్ట్ర మంత్రి సుశీంద్రోకు చెందిన ప్రైవేట్ గోదాముకు కొందరు శనివారం నిప్పు పెట్టారు. శుక్రవారం రాత్రి ఖురాయ్ జిల్లాలో ఆహార శాఖ మంత్రికి చెందిన ఒక ఆస్తికి నిప్పు పెట్టేందుకు కొందరు ప్రయత్నించారు. శుక్రవారం తూర్పు ఇంఫాల్, కాంగ్పోక్పి జిల్లాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పలు జిల్లాల్లో కర్ఫ్యూను సడలించామని పోలీసులు తెలిపారు.