NEET UG | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ), న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ఆదివారం జరగనున్నది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సందర్భంగా సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తారు. తెలంగాణలో 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 72,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాపీయింగ్ను అరికట్టేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ రియల్ టైమ్ అనలెటికల్ టూల్స్, టెక్నాలజీని వాడుతున్నట్టు ఎన్టీఏ తెలిపింది. తప్పుగా సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మైనస్మార్కు కోల్పోవాల్సి ఉంటుంది.
నీట్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు శనివారం అన్ని పరీక్షా కేంద్రాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఏర్పాటు చేసిన5,453 పరీక్షా కేంద్రాలలో ఆదివారం నీట్-యూజీ పరీక్ష జరగనున్నది. ఈ ఏడాది 22.7 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
నీట్-యూజీ 2024 పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో 26 మంది విద్యార్థుల ఎంబీబీఎస్ విద్యార్థులను తక్షణమే సస్పెండ్ చేసినట్లు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) శనివారం ప్రకటించింది. మరో 14 మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించింది.