న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశవ్యాప్తంగా వైద్యులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను 2024కల్లా జారీచేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. ఇందుకోసం వైద్య వృత్తిలో ఉన్న వారందరి వివరాలతో కూడిన ‘జాతీయ వైద్య రిజిస్టర్’ (నేషనల్ మెడికల్ రిజిస్టర్-ఎన్ఎంఆర్)ని రూపొందించనున్నట్టు ఎన్ఎంసీ మంగళవారం తెలిపింది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ను ఆరు నెలల్లోగా చేపడతామని, 2024కల్లా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని ఎన్ఎంసీ బోర్డ్ సభ్యుడు డాక్టర్ యోగేంద్ర మాలిక్ తెలిపారు. ప్రస్తుతమున్న ‘ఇండియన్ మెడికల్ రిజిస్టర్’ స్థానంలో ఎన్ఎంఆర్ అమల్లోకి వస్తుందన్నారు.
వచ్చే ఏడాది నుంచి దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు రేటింగ్ ఇవ్వనున్నారు. విద్యార్థులకు అందించే విద్య నాణ్యతను బట్టి 2024-25 విద్యా సంవత్సరం నుంచి వాటికి రేటింగ్ కేటాయిస్తారు. ఈ మేరకు రేటింగ్స్ నిర్థారణకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)తో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎంఎన్సీ)అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో భాగస్వామ్యమయ్యాయని, ఇక నుంచి వీటిలో ప్రైవేట్ వైద్య కళాశాలలను కూడా చేరుస్తున్నట్టు ఎంఎన్సీ బోర్డు సభ్యుడు డాక్టర్ యోగేంద్ర మాలిక్ చెప్పారు.