ముంబై, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ అణచివేత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు శనివారం మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఐసిస్ మాడ్యూల్ నేత సాకిబ్ నాచన్తోపాటు ఐసిస్తో సంబంధాలు ఉన్న 15 మందిని అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని థానే, పుణే జిల్లాలతోపాటు కర్ణాటకలోని బెంగళూరులో శనివారం ఉదయం నుంచి ఈ దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు. ఒక థానే జిల్లాలో 41 చోట్ల సోదాలు జరిగాయి. దాడుల్లో పెద్దయెత్తున నగదు, ఆయుధాలు, స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నామని అధికారులు వెల్లడించారు.