(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనాన్ని సాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని ప్రదర్శించింది. సీబీఐ, ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతో పాటు అఖిల భారత సర్వీసు ఉద్యోగులను (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్) తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న ప్రయత్నాల్లో మరింత దూకుడు పెంచింది. రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్లు కేంద్రంలో డిప్యూటేషన్పై తప్పనిసరి పనిచేయాలని ఇటీవలే ప్రయత్నించింది. ఇప్పుడు ఐపీఎస్లపై తన గురి పెట్టింది. వివిధ రాష్ర్టాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి ఇవ్వాలన్నా, బదిలీ చేయాలన్నా ముందుగా తమ అనుమతి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
లేకపోతే ఆ పదోన్నతిని రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గత నెల 12న రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసింది. ఆ లేఖలో ఐపీఎస్ల ఉద్యోగ సర్వీస్ రూల్స్ను కూడా ప్రస్తావించింది. ఐపీఎస్ పే రూల్స్ 2016, సెక్షన్ 3(2) ప్రకారం.. రాష్ట్ర క్యాడర్, జాయింట్ క్యాడర్ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే ముందు (ప్రతి హోదాలో) కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నది.
ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని రాష్ర్టాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ ఆధికారులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పదోన్నతులు, నియామకాలపై తన ఆధిపత్యాన్ని సాగించాలని ప్రయత్నిస్తున్నది. హోంశాఖ తన లేఖలో.. రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ ఐపీఎస్ల నియామకాలు, పదోన్నతుల ప్రతిపాదనలు పంపేటప్పుడు తగిన సమాచారం ఇవ్వటం లేదని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అనుమానాలు నివృత్తి చేయడంలో శ్రద్ధ చూపకోవటంతో ప్రతిపాదనలకు అనుమతుల మంజూరులో ఆలస్యం జరుగుతున్నదని వెల్లడించింది. వచ్చే నెల 15లోపు అలాంటి ప్రతిపాదనలుంటే పంపాలని కోరింది.
ఏప్రిల్లోనూ కేంద్ర హోంశాఖ రాష్ర్టాలకు ఇలాంటి హెచ్చరికలతో కూడిన ప్రతిపాదనలే చేసింది. ఎస్పీలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) స్థాయిలో కేంద్రంలో డిప్యూటేషన్పై పనిచేయని రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారులకు భవిష్యత్తులో కేంద్రంలో డిప్యూటేషన్లో పనిచేసే అవకాశం ఉండబోదని దాని సారాంశం. కానీ, ఆ ప్రతిపాదనల వెనుక అసలు కారణం.. కేంద్రంలో ఆ క్యాడర్ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్నాయని, రాష్ర్టాలు ఈ క్యాడర్ అధికారులను కేంద్రంలో డిప్యూటేషన్పై పంపడానికి అనుమతులు ఇవ్వకపోవటమేనని తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందలేదని ఓ సీనియర్ ఐపీఎస్ చెప్పారు. డీఐజీల ఎంపికకు ఉన్న ఎంప్యానెల్మెంట్ను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఐపీఎస్ పోస్టుల భర్తీకి ఎంప్యానెల్మెంట్ రద్దు దోహదపడుతుందని మోదీ సర్కారు వాదిస్తున్నది.
సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు, నియామకాలకు ముందస్తు అనుమతులు కోరాలంటూ రాష్ర్టాలకు కేంద్రం ఆంక్షలు విధించడం రాష్ట్ర పరిపాలనలో ప్రత్యక్ష జోక్యాన్ని సూచిస్తున్నదని రిటైర్డ్ డీజీపీ ఒకరు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ అధికారులను ఎక్కడ ఏ పదవిలో నియమించుకోవాలో, పదోన్నతి ఇవ్వాలో, లేదో, లాంటి స్వతంత్రం లేదంటే అది కచ్చితంగా ఆక్షేపించదగినదేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పుట్టిస్తాయని అన్నారు. 2015 లోనూ ఇలాంటి ఆదేశాలే కేంద్రం నుంచి రాష్ర్టాలకు అందాయని, కానీ, అందులో పదోన్నతుల ను, నియామకాలను రద్దు చేస్తామన్న పదం వాడలేదని వివరించారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఓ మాజీ ఐపీఎస్ సైతం కేంద్ర హోంశాఖ ఆదేశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఒక ఉన్నతాధికారిని ఉన్నత పదవిలో నియమిస్తే కేంద్రానికి సమాచారమివ్వటం వరకే ప్రామాణికంగా వస్తున్నది. కానీ అనుమతి తీసుకోవాలని, లేకుంటే ఆ పదవిని రద్దు చేస్తామని హెచ్చరించటం రాష్ర్టాల హక్కులను హరించటమే’ అని స్పష్టం చేశారు.