న్యూఢిల్లీ: మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం డిగ్రీలు మాత్రమే ఉపాధికి హామీ ఇవ్వకపోవచ్చునని, సంప్రదాయ వృత్తి మార్గాలను పునః సమీక్షించుకోవాలని దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు (ఈసీఏ) వి అనంత నాగేశ్వరన్ యువతకు పిలుపునిచ్చారు. ‘ఏఎన్ఐ’ పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన చాలామంది విద్యార్థులు ఒకదాని తరువాత మరొకటి చదువుకుంటూ వెళతారని, ఈ అర్హతలు స్థిరమైన ఉపాధికి దారితీస్తాయా అని ఆలోచించరన్నారు.
భారతదేశంలో వెల్డింగ్, ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్ లాంటి వృత్తి పరమైన పనులుకు తక్కువ విలువ ఇస్తుంటారన్నారు. స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల్లో వృత్తి నైపుణ్యాలకు అమితమైన గౌరవం ఇస్తారని నాగేశ్వరన్ తెలిపారు. సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏల శకం ముగిసిందని, ఇప్పడు భవిష్యత్ అంతా వృత్తి నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్, మానవ విచక్షణ, ఉనికి అత్యవసరమైన వృత్తులదేనని తేల్చిచెప్పారు. రాబోయే రోజుల్లో కౌన్సెలింగ్, కేర్ గివింగ్, హాస్పిటాలిటీ లాంటి వృత్తులు ప్రధానమైనవిగా మారనున్నాయన్నారు.