Karnataka | కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్ ( DK Shivakumar )గట్టిగా ఆశిస్తున్నారు. సీఎం పదవిని సిద్ధరామయ్యతో కలిసి చెరి రెండున్నర ఏండ్లు పంచుకొనేందుకు ససేమిరా అంటున్న ఆయన, తననే సీఎం చేయాలంటూ హైకమాండ్కు సోమవారం పరోక్ష సంకేతాలు పంపారు. తన బలం 135 మంది ఎమ్మెల్యేలు అని, కష్టాల్లో ఉన్న పార్టీని గెలిపించానని, ఈ విజయం వెనుక ఎవరున్నారో గుర్తించాలంటూ అధిష్ఠానానికి ఓవిధంగా హెచ్చరికలే చేశారు. ఎన్నికల్లో తాను చేసిన కృషికి మర్యాద, కృతజ్ఞత చూపాలంటూ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ/బెంగళూరు, మే 15: కర్ణాటక కొత్త సీఎం ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సీఎం ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నది. సీఎం పోస్టుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండటమే ఇందుకు కారణం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించానని చెబుతున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. అయితే సీఎం ఇచ్చినట్టు.. లేకుంటే ఢీ అనే విధంగానే ఆలోచన చేస్తున్నట్టు ఆయన సోమవారం చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తున్నది. తన బలం 135 మంది ఎమ్మెల్యేలు అని, రాష్ట్ర అధ్యక్షుడిగా తన నేతృత్వంలోనే పార్టీ ఇన్ని సీట్లు గెలిచిందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. అదేవిధంగా పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకొని గెలిపించానని, ఈ విజయం వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని అధిష్టానం గుర్తించాల్సి ఉంటుందని ఒక విధంగా హైకమాండ్కు హెచ్చరికలు చేశారు.
అధిష్ఠానం పిలుపు మేరకు సిద్ధరామయ్య సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లగా.. డీకే మాత్రం పోలేదు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను ఢిల్లీ వెళ్లలేదని శివకుమార్ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మనసులో ఏమున్నదనే దానిపై రాజకీయంగా చర్చలు, పలు ఊహాగానాలు రేగాయి. తాను కూడా ఢిల్లీ వెళ్తున్నానని ఉదయం చెప్పిన డీకే శివకుమార్.. సాయంత్రానికి యూటర్న్ తీసుకొని ఆగిపోవడం గమనార్హం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాష్ర్టానికి చెందిన నేత మల్లికార్జున ఖర్గేపై శివకుమార్ సీఎం పోస్టు విషయంలో అశలు పెట్టుకొన్నారని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య పలువురు ఏఐసీసీ నేతలతో కలిసి మంతనాలు జరిపారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కర్ణాటక సీఎం ఎంపిక కోసం అధిష్ఠానం నియమించిన పరిశీలకుల బృందం అధ్యక్షుడు ఖర్గేతో ఆయన నివాసంలో సాయంత్రం భేటీ అయింది. ఈ సందర్భంగా ఆదివారం సీఎల్పీ సమావేశం సందర్భంగా సేకరించిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికను అందజేసింది. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆదివారం బెంగళూరులో సమావేశమైన సీఎల్పీ.. ఆ బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
కాగా, సీఎంగా సిద్ధరామయ్య వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నదని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో డీకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఎవరనే దానిపై తుది నిర్ణయం హైకమాండ్ తీసుకొంటుందని చెబుతూనే, తన మనసులో మాట బయటపెట్టారు. కర్ణాటకలో విజయం కోసం సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతను ఫలప్రదంగా నిర్వర్తించానని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ విజయం వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని వారు(అధిష్ఠానం) గుర్తుంచుకోవాలని, కనీస మర్యాద, కృతజ్ఞత ఉండాలంటూ డీకే వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తాను బ్లాక్మెయిల్ చేయట్లేదని, ఆ తరహా వ్యక్తిని కాదన్నారు. రాష్ట్రంలో పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకొని, కష్టపడి పనిచేశానని పేర్కొన్నారు.