Maharashtra | ముంబై, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సర్కారీ విద్య కొత్త పుంతలు తొక్కుతుంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలోని మహారాష్ట్రలో మాత్రం తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ బడుల మూసివేతకు రంగం సిద్ధమైంది! 20 మంది కంటే తకువ విద్యార్థులున్న దాదాపు 15 వేల జిల్లా పరిషత్ పాఠశాలలను మూసివేసి, వాటి స్థానంలో గ్రూపు పాఠశాలలు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ విధంగా చేస్తే గ్రామీణ విద్యార్థులు చదువు కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. పేద విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 మంది కంటే తకువ విధ్యార్థులున్న పాఠశాలల వివరాలను ఈ నెల 15లోపు తమకు పంపాలని రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 20 మంది కంటే తకువ విద్యార్థులున్న పాఠశాలలు 14,783 ఉన్నాయి. వీటిలో 1,85,467 మంది విద్యార్థులు చదువుతున్నారు. 29,707 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని భారత రాష్ట్ర సమితి ముంబై విభాగ సమన్వయకర్త శ్రీనివాస్ సులగే, కొంకణ్ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె హెచ్చరించారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు పాఠశాలలను దత్తత ఇచ్చే నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని.. లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని మహారాష్ట్ర శిక్షణ్ బచావో కృతి సమితి ప్రకటించింది. ఇదే విషయమై రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సమితి నిర్ణయించింది.