ముంబై, జనవరి 27: మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నేతృత్వంలో కొనసాగిన సుదీర్ఘ పోరాటానికి మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రిజర్వేషన్లతోపాటు ఇతర డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఆర్డినెన్స్ను కూడా జారీ చేసింది. అనంతరం శనివారం ఉదయం ఓ నోటిఫికేషన్ను జారీ చేస్తూ కుంబీలంతా మరాఠా రక్త సంబంధీకులుగా గుర్తిస్తున్నట్టు తెలిపింది.
మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నేతృత్వంలో పోరాటం కొనసాగిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై శనివారం 11 గంటలకల్లా తేల్చాలని జరాంగే పెట్టిన డెడ్లైన్కు స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే శుక్రవారం రాత్రి అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
అనంతరం ఓ బృందాన్ని జరాంగే వద్దకు పంపారు. రిజర్వేషన్లతోపాటు అన్ని డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పత్రాలను జరాంగేకు బృందం అందజేసింది. తర్వాత శనివారం సీఎం షిండే జరాంగే వద్దకు వెళ్లారు. పండ్ల రసాన్ని అందజేసి నిరసన దీక్షను విరమింపజేశారు.
తన చిరకాల కోరిక నెరవేరడంతో జరాంగే ఆనందం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేశామని, చాలా మంది అమలయ్యారని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడి విజయం సాధించామని తెలిపారు.