ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్తు సంఘాలు 72 గంటల సమ్మెకు దిగడంతో మహారాష్ట్ర సర్కారు దిగొచ్చింది. సంస్థలను ప్రైవేట్ పరం చేయబోమని హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. విద్యుత్తు శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం విద్యుత్తు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం, సంఘాల మధ్య సమాచార లోపం వల్లే వివాదం తలెత్తిందని ఫడ్నవీస్ తెలిపారు. విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పారు.