న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు రూపొందించిన బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లు -2024ను మంగళవారం లోక్సభలో ఆమోదించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మెరిట్ విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించిన బిల్లుగా దీన్ని అభివర్ణించారు. అయితే ఈ బిల్లుకు సంబంధించి విపక్షాలు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాయి.
మరికొన్ని సవరణలు సూచించాయి. అవన్నీ కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాత లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే అక్రమార్కులకు మూడినట్టే. పేపర్ లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లు తెరిచినా గరిష్ఠంగా పదేళ్ల జైలు, కోటి రూపాయల దాకా జరిమానా విధిస్తారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్డీఏ లాంటి పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ఎంట్రన్స్ టెస్టులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది.