జమ్ము, ఫిబ్రవరి 15: తమను కశ్మీర్ లోయ నుంచి బదిలీ చేయాలని, వేతన బకాయిలను చెల్లించాలని కశ్మీరీ పండిట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలియజేయడానికి బుధవారం ప్రెస్క్లబ్ వద్దకు వచ్చిన కశ్మీరీ పండిట్లను పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత ప్రెస్క్లబ్ బయట నిరసన తెలపడానికి పలువురు ఉద్యోగులు సమీప చౌక్ వద్ద సమావేశమై తమ డిమాండ్ల సాధనకు నినాదాలు ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని 50 మందిని అరెస్ట్ చేశారు. ఉద్యోగ నేత యోగేష్ పండిత మాట్లాడుతూ.. తమకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. గత 290 రోజులుగా తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.