ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. ఓ వైపు దీని వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మరోవైపు ఈ సాంకేతికతను అంది పుచ్చుకోవడానికి కంపెనీలు పోటీ పడటంతో ఏఐ మార్కెట్ భారత్లో ఏటా 25-35 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ చూపుతున్న ప్రభావాన్ని రెండు భిన్న కోణాల్లో పరిశీలిద్దాం.
Artificial Intelligence | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రవేశంతో టెక్నాలజీ రంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఉద్యోగుల స్థానంలో ఏఐని ప్రవేశపెట్టి..లాభాలను పెంచుకోవటంపై టెక్ కంపెనీలు దృష్టి సారించాయి. ఒక్కో టెక్ కంపెనీ ఈ దిశగా అడుగులు వేయటంతో..సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఊడుతున్నాయి. గత 12 నెలల్లో 5 దిగ్గజ కంపెనీలు 80 వేలకు పైగా ఉద్యోగులకు గుడ్ బై చెప్పాయి.
గూగుల్ గత ఏడాది 20.7 బిలియన్ డాలర్ల ఆదాయం పొందినా వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించి, గుట్టుచప్పుడు కాకుండా ఏఐ సాంకేతిక పరిజ్ఞాన్ని వాడుకుంటున్నదని ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2023లో గూగుల్ లాభం 52 శాతం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు వల్ల ఉద్యోగాల కల్పన 78 శాతం తగ్గనున్నదని ‘నాస్కామ్’ అంచనా వేస్తున్నది. ఇదిలా ఉండగా, సాంకేతికతను అందిపుచ్చుకున్న వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా కంపెనీలు ఉద్యోగులకు ఏఐ ఆధారిత సాంకేతికతపై శిక్షణా కార్యక్రమాలను చేపట్టాయని అన్నారు.
భారత ఏఐ మార్కెట్ లక్షన్నర కోట్లు!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రపంచ సాంకేతిక రంగాన్ని ఓ ఊపు ఊపేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)కు భారత్లో అసాధారణ అవకాశాలున్నాయని భారత జాతీయ ఐటీ పరిశ్రమలు, సేవల సమాఖ్య (నాస్కామ్), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రకటించాయి. 2027 నాటికి భారత ఏఐ మార్కెట్ విలువ రూ.1.4 లక్షల కోట్లకు చేరుకొంటుందని అంచనా వేశాయి. 2024-27 మధ్య ఏఐ మార్కెట్ వృద్ధిరేటు ఏకంగా 25 నుంచి 35 శాతం వరకు ఉంటుందని ఈ సంస్థలు సంయక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి.
భవిష్యత్తు అంతా కృత్రిమ మేధ దేనని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొనేందుకు కంపెనీలు పోటీ పడి పెట్టుబడులు పెడుతున్నాయి. భారీ పరిశ్రలమ నుంచి మనిషి నిత్యావసరాల వరకు అన్ని రంగాల్లో ఏఐ ఆవశ్యకతను గుర్తించిన సాఫ్ట్వేర్ కంపెనీలు, అత్యుత్తమ ఏఐ టూల్స్ను ఆవిష్కరించేందుకు శ్రమిస్తున్నాయి. అత్యుత్తమ ఏఐ నిపుణులకు భారత్ నిలయంగా మారింది. నాస్కామ్ అంచనా ప్రకారం దేశంలో 4,20,000 మంది అత్యుత్తమ నిపుణులు ఉన్నారు. 65 టాప్ ఐటీ కంపెనీల కార్యకలాపాలను అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేశారు.