న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు బుధవారం రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎలక్ట్రానిక్, పేపర్ రూపంలో ఉన్న డాటాను అధికారులు కాపీ చేసుకొన్నారు. మంగళవారం రాత్రి వివిధ విభాగాలకు చెందిన బీబీసీ జర్నలిస్టులను ఆఫీసు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించిన అధికారులు.. ఫైనాన్స్, పలు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను మాత్రం అక్కడే విచారించారు. పలువురు సిబ్బంది ఫోన్లలోని డాటాను కాపీ చేసుకున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో నాటి రాష్ట్ర సీఎం నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొద్ది రోజులకే ఆ సంస్థపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం గమనార్హం.
సోదాలపై ఐటీ విభాగం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే సమయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని బీబీసీ తెలిపింది. ‘ఐటీ అధికారులు ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నారు. కొంతమందిని ఇంటికి పంపించిన అధికారులు.. మరికొంత మందిని ఉండమని చెప్పారు’ అని బీబీసీ న్యూస్ ప్రెస్ టీమ్ మంగళవారం రాత్రి 10.26 గంటలకు ట్విట్టర్లో పేర్కొన్నది. ఇటువంటి సమయంలో తమ సిబ్బందికి పూర్తి మద్దతుగా ఉంటామని, ఈ పరిస్థితి త్వరలో చక్కబడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. తమ జర్నలిజం స్టాండ్ యథావిధిగానే కొనసాగుతుందని, భారత ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
ప్రధాని మోదీపై డాక్యుమెంటరీని విడుదల చేసిన తర్వాతనే బీబీసీపై ఐటీ దాడులు జరుగడం దేశంతో పాటు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజాలు మాట్లాడే వారిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నదని, ప్రతిపక్షాలతో పాటు మీడియా సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
‘బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు దురదృష్టకరం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు ఇది నిదర్శనం. మీడియాను నియంత్రించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఇటువంటి చర్యలు మీడియా స్వేచ్ఛకు విఘాతం. దేశంలో మీడియా లేని రోజు అనేది వస్తే.. ప్రజల తీర్పును కూడా బీజేపీ నేతలు లెక్కచేయరు. వారి తీర్పు నియంతృత్వం మాత్రమే.. వారు(బీజేపీ నేతలు) హిట్లర్ కంటే ఎక్కువ.’
-మమత , పశ్చిమ బెంగాల్ సీఎం
‘బీబీసీకి వ్యతిరేకంగా ఐటీ చేపట్టిన సోదాలు భారత ప్రతిష్టను దెబ్బతీశాయి. ప్రతిష్టాత్మకమైన జీ-20 దేశాల సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న సమయంలో ఇటువంటి చర్యల ద్వారా ప్రధాని మోదీ మన దేశాన్ని ప్రపంచానికి ఎలా చూపించాలనుకొంటున్నారు?’
-కాంగ్రెస్ నేత పవన్ఖేరా
‘భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలకు పునాదిగా ఉన్న మీడియా, భావ ప్రకటన, మత స్వేచ్ఛ ప్రాముఖ్యతకే అమెరికా మద్దతు ఇస్తుంది. భారత్లో బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాల గురించి మాకు తెలుసు. దీని గురించి మనం మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంది.
-అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్
‘మీడియా అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. దాని గొంతుకను అణచివేయడమంటే.. ప్రజల గొంతును అణచివేయడమే. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు. బీజేపీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, సంస్థలను నాశనం చేసి.. దేశం మొత్తాన్ని ఆ పార్టీ బానిసగా చేయాలని అనుకొంటున్నదా?’
-అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం