లక్నో, డిసెంబర్ 21: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్థంగా తయారైంది. యోగి సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆర్నెల్లుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కుటుంబాలను పోషించుకోవడానికి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు తమ జేబుల నుంచి కార్మికులకు సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. యూపీలోని 2.85 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 3.77 లక్షల మందికి పైగా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వారికి ఇస్తున్న గౌరవం వేతనం రూ.2 వేలు కూడా ఆర్నెల్లుగా ఇవ్వడం లేదు. వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిడ్డే ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు పలు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా.. ఏమాత్రం చలనం లేదని కార్మికులు మండిపడుతున్నారు.
అఖిల భారత అంగన్వాడీ కార్మికులు, హెల్పర్ల సంఘం(ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్) కార్యదర్శి వీనాగుప్తా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మార్చి నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, చివరిగా నెలకు రూ.1,500 ఇచ్చారని, ఆ తర్వాత గౌరవ వేతనాన్ని పేరుకు రూ.500 పెంచారని, అయితే ఇప్పటి వరకు సవరించిన వేతనాలను కార్మికులకు అందించలేదని పేర్కొన్నారు. వేతనాలు రాని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని బస్తీ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే వితంతువైన లక్ష్మీ అనే మధ్యాహ్న భోజన కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పెండ్లికాని కుమార్తె, నిరుద్యోగ కుమారుడు ఉన్నారని పేర్కొన్నారు. వేతనాలు సకాలంలో అందని కారణంగా పలువురు కార్మికులు వేరే ఉపాధి చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు.
బీజేపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై మిడ్డే ఫెడరేషన్ నేతృత్వంలో వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికులు, హెల్పర్లు రోడ్లపైకి వచ్చారు. ఇటీవల రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. తమ గౌరవ వేతనాన్ని రూ.2 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని, రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65కు పెంచాలని, అదేవిధంగా రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. డిమాండ్ల సాధనకు ఫెడరేషన్ వచ్చే వారం లక్నోలో మరో భారీ ఆందోళన చేపట్టనున్నది.