హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఆర్థిక మందగమనం, ఇతర ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ కొత్త నియామకాల్లో ఏకంగా 78 శాతం తగ్గుదల ఉంటుందని నాస్కామ్ అంచనా వేసింది. 2023లో ఐటీ పరిశ్రమ 2.7 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తే.. 2024లో కేవలం 60 వేల కొత్త ఉద్యోగాలే ఉంటాయని తన అధ్యయనంలో పేర్కొన్నది. అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల ఐటీ రంగం కూడా ప్రభావితం అవుతుందని పేర్కొన్నది. 25 వేల కోట్ల డాలర్ల ఐటీ సేవల పరిశ్రమలో 60-80 శాతం ఆదాయం ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచే వస్తుందనేది ఒక అంచనా.
కొవిడ్ కాలంలో ఎక్కువగా నియామకాలు జరిగినందున ఈ ఏడాది అంత స్థాయిలో నియామకాలు ఉండకపోవచ్చని, ఉన్న ఉద్యోగులకే అవసరానికి తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ చెప్పారు. 6.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు అధునిక నైపుణ్యం కోసం శిక్షణ పొందుతున్నారని ఓ నివేదిక పేర్కొన్నది. పెరుగుతున్న సాంకేతికతను అందుకోవడంలో ప్రస్తుత అంతరాలను తగ్గించడం ఐటీ పరిశ్రమ ముందున్న పెద్ద సవాలు అని ఘోష్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డాటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ మొదలైన కొత్త సాంకేతికతలకు సంబంధించిన ఉద్యోగాల డిమాండ్ ఉంటుందని ఆమె చెప్పారు.