Farmers | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పిల్ల కాలువలా మొదలైన హర్యానా రైతుల నిరసన.. పొరుగు రాష్ర్టాల కర్షకుల మద్దతుతో మహా సముద్రమంతటి మహోద్యమంగా మారుతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆదేశాలతో ఖట్టర్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. రైతుల డిమాండ్లను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అలా అన్నదాతల ముందు బీజేపీ సర్కారు మరోసారి ఓడిపోయింది.
పొద్దు తిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అమలు చేయాలని హర్యానా సర్కారుకు అక్కడి రైతులు గత కొన్ని రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, ఈ విజ్ఞప్తులను ప్రభుత్వం పక్కనబెట్టింది. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలను కూడా లెక్కచేయకుండా నిరసనలకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కిసాన్ నేత గుర్నావ్ు సింగ్ చడూనీ సహా పలువురు రైతులను, రైతు నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకించిన వందలాది రైతన్నలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. పోలీస్ నోటీసులను కూడా లెక్కచేయకుండా ‘మహా పంచాయత్’ నిర్వహించి 44వ జాతీయ రహదారిని నిర్వహించారు.
స్వామినాథన్ సిఫారసులకు 50 శాతం కలిపి ఎంఎస్పీ ఇస్తామని చెప్పి మోదీ ప్రభుత్వం రైతులను మభ్య పెడుతున్నారని రైతులు ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయకపోతే దేశవ్యాప్త నిరసన ప్రారంభిస్తామని భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. దీంతో కేంద్రం సూచనల మేరకు హర్యానా సర్కారు ఎట్టకేలకు దిగొచ్చింది. పొద్దు తిరుగుడు విత్తనాలకు క్వింటాలుకు రూ.6400ను కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు రైతుల నేతల విడుదల తదితర 25 డిమాండ్లను నెరవేర్చడానికి అంగీకరించింది.
హర్యానా రైతుల విషయంలో అధికార బీజేపీ ప్రభుత్వం అలసత్వం వహించడంపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ‘సేవ్ ఫార్మర్స్.. జస్టిస్ టు ఫార్మర్స్’ హ్యాష్ట్యాగ్లు ట్రెండయ్యాయి. సర్వత్రా విమర్శలు పెరుగుతుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. బీజేపీ సర్కారు మెడల్ని మరోసారి వంచి తమ హక్కులను సాధించుకున్న రైతుల విజయాన్ని ప్రశంసిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీన్ని రైతన్నల మరో జయభేరిగా అభివర్ణించారు.