హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన ఏకైక అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని, ఈ విషయంలో జాప్యం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెజారిటీ అనేది అసెంబ్లీలోనే తేలాలని, గవర్నర్ బంగ్లాలో ఎమ్మెల్యేల పరేడ్ అవసరం లేదని సుప్రీంకోర్టు ఎస్సార్ బొమ్మై కేసులో స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
1996లో అటల్ బిహారీ వాజపేయికి మెజారిటీ లేకపోయినా అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అప్పటి రాష్ట్రపతి వారిని ఆహ్వానించారని, మెజారిటీ నిరూపించుకోవడానికి 13 రోజుల సమయం ఇచ్చారని తెలిపారు. 2014లో మహారాష్ట్రలో బీజేపీకి 22 సీట్లు తకువ వచ్చినప్పటికీ, అప్పటి గవర్నర్ విద్యాసాగర్రావు ఫడ్నవీస్ను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచిన విషయాన్ని ఆయన ఉటంకించారు.