న్యూఢిల్లీ, నవంబర్ 11: టెస్లా లాంటి దిగ్గజ కంపెనీలు డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తున్న సమయంలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ఓ అడుగు ముందుకేసింది. ఏకంగా.. డ్రైవర్ లేకున్నా గాలిలో ఎగురుతూ గమ్యానికి తీసుకెళ్లే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తామని వెల్లడించింది. వీటిని 2028 కల్లా ట్యాక్సీల రూపంలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. వాస్తవానికి గతేడాదే హ్యూందాయ్ కంపెనీ ఎగిరే కారు ప్రతిపాదనను తీసుకువచ్చింది. అప్పుడే ఉబర్తో ప్రాథమిక ఒప్పందం చేసుకొన్నది. తాజాగా మరిన్ని వివరాలను వెల్లడించింది. ‘సెల్ఫ్ ఫ్లయింగ్ ట్యాక్సీ’ తయారీకి హ్యూందాయ్ ప్రత్యేకంగా భాగస్వామ్య, స్వతంత్ర కంపెనీని ప్రకటించింది. దానికి సూపర్నెల్ అని పేరు పెట్టింది. ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. సూపర్నెల్, ఉబర్ కలిసి ప్రత్యేకమైన యాప్ ద్వారా ఎగిరే కారు ట్యాక్సీ సేవలను అందించనున్నట్టు తెలుస్తున్నది.