Tomato Price | న్యూఢిల్లీ, జూలై 6: దేశంలో టమాటా ధరల మంట ఇంకా చల్లారడం లేదు. ఖరీదైన వస్తువుల జాబితాలో చేరడంతో వాటి చోరీలు కూడా ఎక్కువవుతున్నాయి. వచ్చే రోజుల్లో ఇవి మరిన్ని పెరుగుతాయేమోనని ఇటు రైతులు, అటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టమాటాల ధర పెరగడంతో సామాజిక మాధ్యమాలలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. టమాటాతో భోజనం తింటే కోటీశ్వరుడని, ఇక మనం చిల్లర దొంగతనాలు మానేసి టమాటాలను చోరీ చేద్దామని కొందరు దొంగలు అనుకోవడం లాంటివి ఇందులో ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ కర్ణాటకలోని హసన్ జిల్లాలో గోని సోమనహల్లి గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న టమాట పొలంలో రాత్రి దొంగలు పడ్డారు.
సుమారు రూ.2.5 లక్షల విలువైన 50-60 సంచుల టమాటాను కోసుకుపోయారని బాధిత రైతు ధరణి వాపోయింది. దీనిపై హలీబీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని డోర్నకల్ మార్కెట్లో బుధవారం రాత్రి లక్పతి అనే వ్యక్తి షాపులో 20 కిలోల టమాటాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ చోరీ సీసీ ఫుటేజ్లో నమోదైంది. కేసు దర్యాప్తులో ఉంది.
కేజీ టమాట రూ.162
గురువారం దేశంలో కేజీ గరిష్ఠ చిల్లర ధర 162 రూపాయలు పలికి కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. మెట్రో నగరాల్లో టమాటా అధిక ధర పలుకుతున్నది. యూపీలోని షాజహాన్పూర్లో కిలో 162 రూపాయలకు అమ్మగా, కోల్కతాలో 152, ఢిల్లీలో 117, చెన్నై, ముంబైలలో 108, బెంగళూరులో 107, హైదరాబాద్, భోపాల్లలో 90 రూపాయల ధర పలికింది. దేశంలో గురువారం టమాట కిలో సగటు ధర రూ.95.58గా ఉంది. రాజస్థాన్లోని చురు జిల్లాలో కిలో టమాట 31 రూపాయల ధరే పలకడం విశేషం.