ఓ నివేదిక ప్రకారం 1963 నుంచి ఇప్పటి వరకు సుమారు 400కి పైగా మిగ్ విమానాలు కూలిపోయాయి. ఈ ఘటనల్లో 200 మందికిపైగా పైలట్లు, 50 మందికి పైగా పౌరులు మరణించారు.
MiG-21 | భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రత్యేకంగా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఎక్కువగా కుప్పకూలిపోతున్నాయి. ఇవి అనేక మంది శిక్షణ పైలట్ల ప్రాణాలను హరించివేస్తున్నాయి. అయినప్పటికీ వీటిని పక్కనపెట్టడం లేదు. 60 ఏండ్లకు పైబడిన మిగ్-21 విమానాలను సోవియట్ యూనియన్కు చెందిన మికోయాన్ గురెవిచ్ తయారు చేశారు. దీంతో ఆయన పేరుమీదనే వీటికి మిగ్ అని నామకరణం చేశారు.
మొట్టమొదటి సూపర్సోనిక్ యుద్ధ విమానాలు ఇవే. ఎక్కువగా అమ్ముడుపోయినవి ఇవే కావడం విశేషం. 1963లో భారత ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. మొత్తంగా 840 విమానాలను భారత్ కొనుగోలు చేసి ఆర్మీలో చేర్చింది. పాతతరం యుద్ధ విమానాలైన మిగ్లను రష్యా 1985లోనే పక్కనపెట్టింది. ఆఖరికి బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సైతం వీటి సేవలను నిలిపివేశాయి. కానీ భారత్ మాత్రం 60 ఏండ్లకు పైబడిన వీటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నది. పాత తరం యుద్ధ విమానాలు కావడంతో మిగ్-21 విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని 2016లో కాగ్ నివేదిక ఇచ్చింది.
మిగ్-21 యుద్ధ విమానం కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజస్థాన్లో సోమవారం చోటుచేసుకున్నది. భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా హనుమాన్గఢ్ జిల్లాలోని పిలిబంగ ప్రాంతంలో ఓ ఇంటిపై కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. కొంతమంది గాయపడినట్టు సమాచారం. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్ కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు.
భారత వైమానిక దళం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం వైమానిక దళంలో మొత్తం 42 స్కాడ్రన్ల అవసరం ఉండగా, 32 ఉన్నాయి. దీంతో కాలం చెల్లిన ఫైటర్లను ఇంకా వాడుతున్నారు. వీటిలోనూ మిగ్-21, మిగ్-29కే, మిరాజ్-21, జాగ్వా ర్ రకానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయి.
2012లోనే అప్పటి రక్షణ మంత్రి ఆంటోనీ.. మిగ్లు కూలి 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మరణించారని తెలిపారు. మిగ్ల స్థానంలో కొత్త తరం విమానాలను చేర్చేందుకు 1980ల్లోనే అప్పటి ప్రభుత్వం ఎల్సీఏ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్తో చేతులు కలిపి తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ల అభివృద్ధిని ప్రారంభించింది. 2016 నాటికి తేజస్ వైమానిక దళానికి చేరుకుంది. కానీ మోదీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదన్న వాదనలు ఉన్నాయి. దీంతో 123 తేజస్ విమానాలు కావాలని వైమానిక దళం ప్రతిపాదనలు పంపగా, ఇప్పటివరకు సుమారు 30 వరకే అందాయి.
– నేషనల్ డెస్క్