న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుతో రాత్రిళ్లు కరెంట్ బిల్లులు మోత మోగనున్నాయి. ఈ విధానం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపాలని చూస్తున్నది. టైం ఆఫ్ ది డే (టీవోడీ) టారిఫ్ పేరిట ఉదయం పూట విద్యుత్తు వినియోగంపై సుమారు 10-20 శాతం వరకు విద్యుత్తు చార్జీలు తక్కువగా ఉంటాయని కేంద్రం పేర్కొన్నది. ఉదయం వేళల్లో సోలార్ విద్యుత్తును వాడతారని, దాని ఉత్పత్తి వ్యయం తక్కువ కావడంతో వ్యయానికి తగ్గట్టుగా వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. అదే సమయంలో రాత్రి వేళ విద్యుత్తు వాడకానికి సుమారు 20 శాతం వరకు అధిక చార్జీలు వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. నాన్ సోలార్ పవర్ అనగా థర్మల్, జల విద్యుత్తును రాత్రి సమయంలో వాడతారని తెలిపింది. వాటి ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడంతో రాత్రిళ్లు అధిక చార్జీలు వసూలు చేయనున్నట్టు పేర్కొన్నది. ఈ లెక్కన చూస్తే రాత్రి సమయంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రజలపై మరింత భారం పడనున్నది. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకే కేంద్రం నూతన విధానాన్ని తీసుకొచ్చిందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
కృత్రిమ కొరతను సృష్టించి బొగ్గు ధరను కేంద్రం అమాంతం పెంచేసిందని ఢిల్లీ విద్యుత్తు శాఖ మంత్రి అతిషి ఆరోపించారు. బొగ్గు నిల్వల నిర్వహణలో కేంద్రం విఫలమైనందునే విద్యుత్తు టారిఫ్లు పెంచిందని మంత్రి విమర్శించారు. ఢిల్లీలో సోమవారం మంత్రి మాట్లాడారు. బొగ్గు కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా 10 శాతం విదేశాల నుంచి దిగుమతి అయిన బొగ్గును కొనుగోలు చేయాలని కేంద్రం నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. దేశీయ బొగ్గు రూ.2 వేలకే టన్ను దొరుకుతున్నదని, విదేశీ బొగ్గుకు రూ.25 వేలు చెల్లించాల్సి వస్తున్నదని ఆమె తెలిపారు.