న్యూఢిల్లీ, నవంబర్ 18: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), కేజ్రీవాల్ సర్కారు మధ్య వివాదం మరింత ముదిరింది. రాజకీయ అవసరాల కోసం తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఢిల్లీ ప్రభుత్వ సంస్థ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ ఢిల్లీ (డీడీసీడీ) వైస్ చైర్మన్ జాస్మిన్ షాను విధుల నుంచి ఎల్జీ తప్పించారు. షా కార్యాలయాన్ని సీల్ చేశారు. ఢిల్లీ అభివృద్ధికి మేధోసంస్థలా పనిచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం డీడీసీడీని ఏర్పాటు చేసింది.
ఢిల్లీ పాలకపక్షమైన ఆప్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జాస్మిన్ షా ప్రభుత్వ పదవిని నిర్వహించడంపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ గత నెల ఎల్జీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎల్జీ తాజాగా చర్యలు తీసుకున్నారు. దీనిపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్సిసోడియా మండిపడ్డారు. ఆప్ ప్రతినిధి అన్న కారణంతో షా కార్యాలయానికి సీల్ చేశారని, మరి ఐటీడీసీ చైర్మన్గా ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కార్యాలయానికి ఎందుకు సీల్ వేయట్లేదని నిలదీశారు.