న్యూఢిల్లీ: ఇప్పటికే 13 దేశాల్లో పాగావేసి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి న్యూ వేరియంట్ ఒమిక్రాన్పై ( Omicron ) రేపు లోక్సభలో చర్చ జరుగనుంది. రూల్ 193 కింద రేపు లోక్సభలో ఒమిక్రాన్పై చర్చ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారం క్రితం ఆఫ్రికా దక్షిణ దేశాల్లో పుట్టిన న్యూ వేరియంట్ ఒమిక్రాన్.. ఆ తర్వాత మెల్లగా ఇజ్రాయెల్, బ్రెజిల్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు విస్తరించింది.
ఈ ఒమిక్రాన్ అత్యంత వేగంగా ప్రమాదకరంగా విస్తరిస్తుండగా ప్రపంచ దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ఈ కొత్త వేరియంట్ను నిలువరించడానికి చాలా దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. ఇజ్రాయెల్ సహా పలు దేశాలు సరిహద్దులను మూసేశాయి. పలు దేశాలు అంతర్జాతీయ విమానాల రాకపోకలతపై నిషేధం విధించాయి. మన దేశంలో కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్పై బ్యాన్ విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.