కర్నాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో హిజబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. ఓ వర్గం హిజబ్ ధరించి విద్యా సంస్థలకు వస్తే, మరో వర్గం కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరయ్యారు. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఓ కొత్త వీడియో బయటపడింది. హిజబ్ ధరించిన ఓ విద్యార్థి కాలేజీకి వస్తే, కాషాయ స్కార్ఫ్ ధరించిన వాళ్లు ఆ విద్యార్థిని ముందుకు వచ్చి, జై శ్రీరాం… జై శ్రీరాం అని నినాదాలు చేశారు. దీంతో హిజబ్ ధరించిన విద్యార్థి అల్లాహ్ అక్బర్ అంటూ నినాదాలు చేసింది. ఈ ఘటనపై హిజబ్ ధరించిన విద్యార్థిని స్పందించింది. ‘హిజబ్ ధరించే నేను కాలేజీకి వచ్చాను. దీంతో దానిని తీసేయాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎంతకూ నన్ను కాలేజీలోకి వెళ్లనివ్వడం లేదు. నన్ను చుట్టుముట్టి జైశ్రీరాం.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. కేవలం విద్యార్థులే కాదు.. అవుట్ సైడర్స్ కూడా వున్నారు. ఈ సమయంలో మా కాలేజీ ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నాకు మద్దతుగా నిలిచారు. దీంతో నేను అల్లాహ్ అక్బర్ అని నినదించాను’ అని వివరించింది.
కాలేజీలను మూసేయండి : సిద్దరామయ్య డిమాండ్
కర్నాటకలోని పలు కాలేజీల్లో హిజబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. విద్యా సంస్థలన్నింటినీ మూసేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలను మూసేసి, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని వారిద్దరూ డిమాండ్ చేశారు. అప్పుడే శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.