New Criminal Laws | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమోదించిన నేర న్యాయ చట్టాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు కానున్నాయి. దేశంలోని నేర న్యాయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం ఈ చట్టాలను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే వాహనాలు ఢీకొట్టి ప్రమాదానికి గురైనపుడు, పరారయ్యే డ్రైవర్లపై చర్యలకు సంబంధించిన నిబంధనలు మాత్రం అమల్లోకి రావు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ శనివారం మూడు నోటిఫికేషన్లను జారీ చేసింది. కొత్త చట్టాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గతేడాది డిసెంబర్ 25న ఆమోదం తెలిపారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106(2)ను మాత్రం జూలై 1 నుంచి అమలు చేయడం లేదని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తెలిపింది. ఏదైనా వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా, దురుసుగా వాహనాన్ని నడిపి, ఓ వ్యక్తి మరణానికి కారకుడైనపుడు, ఆ మరణం ఉద్దేశపూర్వక హత్యగా పరిగణింపబడనపుడు, ఆ సంఘటన గురించి పోలీసు అధికారికి లేదా మేజిస్ట్రేట్కు తెలియజేయకుండా ఆ డ్రైవర్ పరారైతే, ఆ డ్రైవర్కు గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తున్నది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పందిస్తూ, ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్తో సంప్రదించిన తర్వాతే ఈ నిబంధనను అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.