రాజ్కోట్: భార్యాభర్తల వయస్సు నలభై కూడా దాటలేదు. ఇద్దరు పిల్లలు. హాయిగా సాగాల్సిన జీవితం. కానీ, మూఢనమ్మకం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. బలిపీఠాన్ని వారే తయారు చేసుకొని ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ భీతావహ సంఘటన గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా వింఛియలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. హెముభాయ్ మక్వానా (38), హంసబెన్ (35) భార్యాభర్తలు.
శనివారం అర్థరాత్రి వారు గ్రామంలోని తమ పొలం వద్ద గుడిసెలో స్వీయబలి ఇచ్చుకున్నారు. ఇందుకు గానూ వారి తలలు తెంచేసేలా గిలెటిన్ లాంటి ఒక పరికరాన్ని స్వయ ంగా తయారుచేసుకున్నారు. దీనికి పదునైన పెద్ద రంపాన్ని అమర్చి ఒక తాడు కట్టారు. పక్కనే మంటను ఏర్పాటు చేశారు. ఈ పరికరం కింద దంపతులిద్దరూ పడుకొని ఆ తాడు వదలగానే ఆ రంపం వారి తలలను కోసేసింది. ఆ తర్వాత తెగిన తలలు ముందే ఏర్పాటు చేసుకున్న మంటలో పడ్డా యి. మూఢనమ్మకంతోనే ఈ విధంగా వారు తమను తాము బలి ఇచ్చుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.