(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేలా హామీల వర్షం కురిపింది. నిధులు లభ్యతపై అవగాహన, ముందస్తు ఆలోచన లేకుండా ఇచ్చిన ఆ హామీలను అమలు చేయకుంటే.. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిక్కుతాయేమోనని, రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ పార్టీ ఆందోళన చెందుతున్నది. హామీలను అమలు చేసేందుకు అవసరమైన నిధులు లేకపోవడంపై ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై కన్నేసింది. రూ.11 వేల కోట్ల సబ్ప్లాన్ నిధులను వాడుకోవాలని సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. నిధుల మళ్లింపు నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.
అమలుకు ఏడాదికి వేల కోట్లు
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ప్రతి నెలా రూ.2 వేలు, బీపీఎల్ కుటుంబాల్లోని ప్రతి సభ్యుడికి 10 కేజీల బియ్యం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పేరుతో కాంగ్రెస్ ఐదు హామీలు ఇచ్చింది. వీటి అమలుకు ఏడాదికి 62 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది రాష్ట్ర రెవెన్యూ వసూళ్ల లక్ష్యమే 72 వేల కోట్లు కావడం గమనార్హం.
సబ్ప్లాన్ నిధులే దిక్కు
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.34 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని తీర్మానించారు. సబ్ప్లాన్కు సంబంధించిన రూ.11 వేల కోట్లలో ఐదు హామీల అమలు కోసం ఎస్సీలకు రూ.7700 కోట్లు, ఎస్టీలకు 3,400 కోట్లు కేటాయించారు.