Arvind Kejriwal | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం శనివారం దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బీజేపీ ఎమ్మెల్యే రామ్వీర్ సింగ్ భిదూరి మినహా తక్కిన 54 మంది ఆప్ ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. కాగా 7 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్లో ఉన్నారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ బలం 62 మంది ఎమ్మెల్యేలు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమలం ఓడిపోయిందని నిరూపించటమేనని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంపై ఈడీ పిటీషన్ దాఖలు చేసిన కేసు విచారణ శనివారం జరిగింది. దీనికి కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని కోర్టుకు తెలిపారు. కేసును మార్చి 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.