న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో ఇప్పటికీ న్యాయస్థానాలు అతికొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మెజారిటీ ప్రజలకు న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవటంపై అవగాహనే లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తంచేశారు.
న్యాయవ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకొన్నప్పుడే పేదలకు దాస్య విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అథారిటీస్ సమావేశంలో శనివారం ఆయన ప్రసంగించారు. అత్యధిక మంది ప్రజలకు న్యాయ వ్యవస్థను చేరువ చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు.
జైళ్లలో దీర్ఘకాలంగా మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించి, వారికి విముక్తి కలిగించటమే న్యాయవ్యవస్థకు ప్రస్తుతం ప్రధాన్యాంశమని జస్టిస్ రమణ అన్నారు. ‘అసమానతలను రూపుమాపటం అనే లక్ష్యంమీదనే ఆధునిక భారతదేశం నిర్మితమైంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. సామాజిక రుగ్మతలను రూపుమాపకుండా ఇది సాధ్యం కాదు. న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవటం సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఓ చక్కని దారి. అండర్ట్రయల్స్కు సముచిత విముక్తి కల్పించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) క్రియాశీలకంగా పనిచేస్తున్నది’అని పేర్కొన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్యానికి డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీయే వెన్నెముక అని సీజేఐ రమణ అన్నారు. ‘దేశంలో న్యాయసేవా ఉద్యమానికి చోదక శక్తి నిస్సందేహంగా డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీయే. న్యాయవ్యవస్థకు ఇది వెన్నెముకలాంటిది. డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీలో తమ అనుభవాలను బట్టే ప్రజలు భారత న్యాయవ్యవస్థపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకొంటారు’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు.