న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఒక పార్టీ కాదని, ఒక కంపెనీ అని ఆయన విమర్శించారు. అందుకే గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా సమస్య పరిష్కారం కోసం చర్చలు మాత్రం జరుగడం లేదన్నారు. కేంద్రం ఒకవైపు రైతు సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం అంటూనే.. మరోవైపు సాగు చట్టాలను రద్దుచేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోందని రాకేశ్ రాకేశ్ తికాయత్ చెప్పారు. సాగు చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అయినప్పుడు.. ప్రభుత్వం కండిషన్లు పెడుతూ చర్చలకు సిద్ధమని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.