న్యూఢిల్లీ: భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీకాలాన్ని కేంద్రం మరో మూడేండ్లు పొడిగించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన గుజరాత్ నుంచి నమ్మకస్తులైన అధికారులను తనతోపాటు తీసుకువచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకమైన న్యాయ అధికారిగా తుషార్ మెహతా పేరు అప్పటి నుంచి ప్రముఖంగా వినిపించింది. 2014లో మెహతా అడిషనల్ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. అక్టోబర్ 2018లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టారు.
2023లో మూడేండ్లపాటు తిరిగి నియమితులయ్యారు. ఇప్పుడు నాలుగోసారి నియమితులై మొత్తం 11 ఏండ్లు పూర్తి చేసుకొన్నారు. 2008లో గుజరాత్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమితులైన తర్వాత, అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ రాష్ర్టానికి మెహతా ప్రధాన న్యాయవాదిగా వ్యవహరించారు. 2014లో ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అమిత్షాను ఈ కేసు నుంచి నిర్దోషిగా విడుదల చేసింది. 2014 నుంచి మెహతా పలు విషయాల్లో ప్రభుత్వ పక్షాన్ని ముందుండి నడిపించారు. సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ బాండ్ల కేసు, రామజన్మభూమి హక్కుల వివాదం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు, ఇటీవలి టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్పై ప్రభుత్వ నిషేధం.. ఇలా పలు కేసుల్లో మెహతా కీలక పాత్ర పోషించారు.
అమిత్ షా, మెహతాల మధ్య ఉన్న స్నేహం రహస్యమేమీ కాదు. మెహతా రాసిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెహతా ఏఎస్జీగా ఉన్నప్పుడు 2017లో అమిత్ షా కుమారుడు జై షా తరఫున న్యాయవాదిగా ‘ది వైర్’ న్యూస్ పోర్టల్పై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసును తుషార్ వాదించారు. ప్రైవేట్ కేసులో ప్రభుత్వ న్యాయాధికారి హాజరు కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, అప్పటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మెహతాకు అనుమతి ఇచ్చినట్టు నివేదికలు తెలిపాయి.