న్యూఢిల్లీ, జనవరి 27: ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు, క్రమబద్ధీకరణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టబోతున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. రెండు అంచెల్లో సంస్కరణలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఒకటి.. ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు మాత్రమే ఇచ్చే ‘బైనరీ అక్రెడిటేషన్ రెండోది.. డిసెంబర్ అమల్లోకి నుంచి మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్.
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉత్తమ పద్ధతులను అనుసరించి ‘బైనరీ అక్రెడిటేషన్’ జారీ చేస్తామని, ఒకవేళ ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచస్థాయి గుర్తింపును కోరుకుంటే ‘మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్’ను ఎంచుకోవచ్చునని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థల ‘గ్రేడెడ్ అక్రెడిటేషన్ ’, ‘ర్యాంకుల’ స్థానంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని డాక్టర్ కే రాధాకృష్ణన్ (ఇస్రో మాజీ చైర్మెన్) నేతృత్వంలోని కమిటీ సిఫారసులు చేయగా, దీనికి ‘న్యాక్’ ఎగ్జిక్యూటివ్ కమిటీ శనివారం ఆమోదముద్ర వేసింది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) అమల్లో భాగంగా ఉన్నత విద్యా వ్యవస్థలో అత్యంత వేగంగా సమూల మార్పులు తీసుకురాబోతున్నట్టు ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
న్యాక్ ఏ++, ఏ+,ఏ, బీ అంటూ ఉన్నత విద్యా సంస్థలకు జారీచేస్తున్న గుర్తింపు విధానం రద్దు అవుతుంది. ప్రస్తుతమున్న ‘మెథడాలజీ’ ప్రకారం ‘గుర్తింపు’ లేదా ‘గుర్తింపు లేదు’ (బైనరీ అక్రెడిటేషన్) అన్నది మాత్రమే జారీ అవుతుంది. రెండోది.. ‘మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్’. కాలేజీ నేపథ్యం, విద్యా ప్రమాణాలు, నాణ్యత, స్థాయిని తెలిపే విధంగా లెవల్-1 నుంచి లెవల్-5 వరకు వివిధ హోదాలో గుర్తింపు ఉంటుంది. 2024 డిసెంబర్ నుంచి ‘మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్’ను ఇవ్వబోతున్నట్టు తెలిపింది. ‘గ్లోబల్ ఎక్స్లెన్స్’ కాలేజీకి లెవల్-5 స్థాయి దక్కుతుంది.
ఉన్నత విద్యాసంస్థల డాటా నిర్వహణ, పారదర్శకత కోసం..వీటిని ‘వన్ నేషన్ వన్ డాటా’ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. సంస్థాగత డాటాను అందజేయటంలో సమగ్రత, పారదర్శకతను నిర్ధారించడానికి సంస్కరణలో భాగంగా కమిటీ దీనిని ప్రతిపాదించింది. డాటా చెల్లుబాటు, విశ్వసనీయత మెరుగుపర్చడానికి దీనిని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపింది. విద్యార్థులు, పరిశ్రమలు, ఇతరులు డాటాను పొందే విధంగా డిజైన్ చేసింది.