న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పరీక్షల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఓపెన్ బుక్ పరీక్షలు (ఓబీఈ) నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ మీడియా డైరెక్టర్ రామశర్మ తెలిపారు. త్వరలో ప్రయోగాత్మకంగా ఓబీఈలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విధానానికి సీబీఎస్ఈ గవర్నింగ్ బోర్డు 2023లోనే ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సీబీఎస్ఈ పరిధిలో చదువుతున్న 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఓబీఈ విధానం అమలుచేయనున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వచ్చే నవంబర్లో ప్రయోగాత్మకంగా ఓబీఈలు నిర్వహించనున్నట్టు సమాచారం. ముందుగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లోనే 9, 10 తరగతుల విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహస్తారు. 11, 12 తరగతుల విద్యార్థులకు బయాలజీ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులను ఓబీఈ విధానంలో నిర్వహిస్తారు. పైలట్ పరీక్షలు మంచి ఫలితాలిస్తే అన్ని పాఠశాలల్లో ఇదే విధానంలో అన్ని సబ్జెకుల పరీక్షలు నిర్వహిస్తారు. ఓబీఈ విధానంలో ప్రశ్నలు నేరుగా ఉండవని, విద్యార్థి విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయని బోర్డు వర్గాలు తెలిపాయి. పరీక్ష హాల్లోకి తమ పాఠ్యపుస్తకాలను తీసుకెళ్లి, వాటిలో చూసి పరీక్షలు రాయటమే ఓపెన్ బుక్ పరీక్షా విధానం. అయితే, పుస్తకంలో ఉన్నట్టుగా ప్రశ్నపత్రంలో ప్రశ్నలు అడుగరు. అడిగిన ప్రశ్నకు పాఠ్యపుస్తకంలోని అంశాలను విద్యార్థి అన్వయించి, విశ్లేషించి జవాబు రాయాల్సి ఉంటుంది.