PM Modi : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress Party President), రాజ్యసభ (Rajya Sabha) లో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కు ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ 84వ ఏట అడుగుపెట్టిన ఖర్గేకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రధాని తన సందేశాన్ని పంచుకున్నారు.
“రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు దీర్ఘాయువును, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా” అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సైతం ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలను గుర్తుచేస్తూ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవర అభినందనలు తెలియజేశారు.
పార్టీ పట్ల, రాజ్యాంగంపట్ల ఖర్గేకు ఉన్న అంకితభావాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ఎంపీ మాణిక్యం ఠాగూర్ కొనియాడారు. 1942 జూలై 21న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఒక దళిత కుటుంబంలో జన్మించిన ఖర్గే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విశేష అనుభవం గడించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.