న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: మొదటి దశ చీతాల ప్రాజెక్టులో భాగంగా తెచ్చిన పలు చీతాల మరణం నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రెండో దశ చీతా ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నది. మరోసారి దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్కు దిగుమతి చేయనున్నట్టు చీతా ప్రాజెక్ట్ హెడ్ ఎస్పీ యాదవ్ శనివారం ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి మరో విడతగా చీతాలను తీసుకొచ్చి, మధ్యప్రదేశ్లోని ‘గాంధీ సాగర్ వణ్యప్రాణుల అభయారణ్యం’లో ప్రవేశపెడుతామని తెలిపారు.
ఈ ఏడాది చివరిలో చీతాలు రావొచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టు రెండో ఏడాదిలో చీతాల సంతానోత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఎస్పీ యాదవ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో దట్టమైన బొచ్చు (వింటర్ కోట్) పెరిగే చీతాలను తీసుకురావడం వలన ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురయ్యాయని, మూడు చీతాల మరణాలకు అదే ప్రధాన కారణమైందని పేర్కొన్నారు. ఈసారి తీసుకొచ్చే చీతాల్లో వింటర్ కోట్ లక్షణాలు లేని వాటిని ఎంపిక చేస్తామని, ఇవి భారత వాతావరణ పరిస్థితులకు సరిపోతాయని తెలిపారు.
వాతావరణంపై అవగాహన లేకుండా…
‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా భారత్లోకి చీతాలు అడుగుపెట్టి ఆదివారంతో ఏడాది పూర్తవుతుంది. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతల్లో మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో వదిలిపెట్టారు. ఇప్పటి వరకు ఆరు చీతాలు, మూడు కూనలు మరణించాయి. స్థానిక వాతావరణం గురించి ఆలోచించకుండా, సరైన అవగాహన లేకుండా చీతాలను భారత్ తీసుకొచ్చారనే విమర్శలున్నాయి. ప్రచార ఆర్భాటం, ఫొటో సెషన్లో భాగంగా చీతాలను కునో పార్క్లో ప్రవేశపెట్టే సమయంలో కనిపించిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ప్రాజెక్టును పట్టించుకోలేదన్న ఆరోపణలు వెలువడ్డాయి.