Vande Bharat Express | (స్పెషల్ టాస్క్ బ్యూరో) | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్’ తయారీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. సాంకేతిక భాగస్వామ్యం పేరిట జాతి సంపదను ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టేందుకు సిద్ధమవుతున్నది. పెరంబదూర్లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ యూనియన్, రైల్వే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్, లేబర్ ప్రొగ్రెసివ్ ఫెడరేషన్, హింద్ మజ్దూర్ సభ తదితర సంఘాల కార్మికులు కేంద్రం ఉద్దేశాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
ప్రస్తుతం వందే భారత్ -2 పేరుతో స్లీపర్ (పడుకుని పోయే) వ్యవస్థను కల్పించే హై స్పీడ్ రైళ్ల ప్రారంభానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అయితే ఈ రైళ్ల తయారీలో సాంకేతిక భాగస్వామ్యం పేరిట కేంద్రం మేధా సర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్, అలస్ట్న్ ఎస్.ఎ. వంటి సంస్థలను జొప్పిస్తున్నదని రైల్వే ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వందే భారత్-2 రైళ్లలో బెర్త్ లాంటి వ్యవస్థల్లో స్వల్ప తేడాలు మాత్రమే ఉండబోతున్నాయని ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం వీటి తయారీలో కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట వేసే బదులు తక్కువ ధర కలిగిన ట్రాక్షన్ మోటార్ల ఉత్పత్తి పరిశోధన, అభివృద్ధి పనులపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్కు కేటాయించిన నిధులలో ఇందుకు 5 శాతం నిధులు కేటాయిస్తే సరిపోతుందని సూచించారు.
2018లో మోడర్న్ వీల్ అండ్ యాక్సిల్ లైన్ అభివృధ్ధి చేశామని, ప్రభుత్వం వీటి ఉత్పత్తి ఎందుకు ప్రారంభించలేదని కార్మికులు ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు భాగస్వామ్యం కట్టబెట్టే బదులు స్వదేశీ వనరులను ఉపయోగించి సాంకేతికతను అభివృద్ధి చేయాలి. దీంతో కోచ్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. బీహెచ్ఈల్, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్స్ , యూనియన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల పరిశోధన, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలు కలిసి పనిచేస్తే సరిపోతుంది. దీని గురించి మేం కేంద్ర మంత్రికి లేఖ రాశాం.
– బి.రాజా రామన్, కార్యదర్శి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్