PM Modi | న్యూఢిల్లీ, జూలై 9: ప్రజల తిండికి భరోసా లేదు.. నీటికి గ్యారెంటీ లేదు.. చివరకు ఆరోగ్యానికీ విలువ లేదు.. ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన తీరు. అడ్డదిడ్డ నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలకు తిండి, నీళ్లను పిరం చేసిన మోదీ సర్కారు.. ఇప్పుడు 140 కోట్ల మంది ఆరోగ్యాన్ని పణంగా పెట్టేందుకు ఎక్కడలేని ఆసక్తి చూపుతున్నది. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్తోపాటు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయంటూ ప్రపంచమంతా నిషేధించిన పలు కృత్రిమ చక్కెర బ్రాండ్లకు మనదేశంలోకి తలుపులు బార్లా తెరుస్తున్నది.
ఏం జరుగుతున్నది?
ఆస్పర్టేమ్ అనేది ఒక కృత్రిమ చక్కెర బ్రాండ్. డయాబెటిక్ రోగులు తీపికోసం వాడే కృత్రిమ చక్కెరల్లో ఇదీ ఒకటి. అయితే, ఆస్పర్టేమ్ వాడితే క్యాన్సర్తోపాటు గుండెజబ్బులు వచ్చే ప్రమాదమున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చెందిన క్యాన్సర్ రిసెర్చ్ విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్'(ఐఏఆర్సీ) ఇటీవలే హెచ్చరించింది. దీంతో అన్నిదేశాలు అప్రమత్తమై దాని వాడకంపై నియంత్రణలు విధించాయి. కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకొన్నది. ఆస్పర్టేమ్ను మనదేశంలో విక్రయించేందుకు ‘ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతి ఇచ్చింది. ఇదేమని అడిగితే డబ్ల్యూహెచ్వో చెప్తే మేం వినాలా? అని ప్రశ్నిస్తున్నది. ‘ఆస్పర్టేమ్ లేదా మరో కృత్రిమ చక్కెర ఏదైనా.. వాటి వినియోగం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయన్నదానిపై మేం స్వయంగా అధ్యయనం చేస్తున్నాం’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు హెచ్ఎస్ ఒబెరాయ్ తెలిపారు. కోకాకోలా, పెప్సీకో, రెడ్బుల్, డాబర్ వంటి కంపెనీలతో కూడిన ఇండియన్ బెవరేజెస్ అసోసియేషన్ (ఐబీఏ) గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. వాస్తవం ఏమిటంటే.. ఆస్పర్టేమ్ వంటి కృత్రిమ చక్కెరలను ఎక్కువగా వాడేది ఈ కంపెనీలే. స్టెవియా అనే ఓ సహజ చక్కెర బ్రాండ్ను 2011లో నాటి యూపీఏ నిషేధించింది. 2015లో మోదీ సర్కారు నిషేధాన్ని ఎత్తేసింది.
ఆందోళన ఎందుకు?
శీతలపానీయాలు, చూయింగ్ గమ్స్, ఐస్క్రీమ్స్, కేక్స్, కలాకండ్, రస్మలాయ్ వంటి వాటిల్లో కూడా ఈ స్వీట్నర్లను వాడుతున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై స్పృహ పెరుగుతుండటంతో నాన్-షుగర్ స్వీట్నర్స్కు డిమాండ్ పెరుగుతున్నది. అయితే, వీటిలో ఏవి ప్రమాదకరమో ఇప్పటికీ సరైన శాస్త్రీయ అధ్యయనం జరుగలేదు. ఆస్పర్టేమ్, స్టెవియా వంటి నాన్-షుగర్ స్వీట్నర్స్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదమున్నదని హెచ్చరించింది. ఎలుకలు, ఇతర చిన్న జంతువులపై చేసిన పరిశోధనలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావాన్ని ప్రతిబింబించవని హైదరాబాద్లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నూట్రిషన్ మాజీ డైరెక్టర్ బీ శశికిరణ్ తెలిపారు.
సమస్య నిజం.. సాక్ష్యమే లేదు
కృత్రిమ చక్కెరలతో డయాబెటిక్, గుండె నొప్పి వంటి సమస్యలు వస్తాయని ప్రాథమికంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. జీరో క్యాలరీ షుగర్ ఎరిత్రిటోల్ వాడితే గుండెపోటు రావచ్చని ఈ ఏడాది మొదట్లో పరిశోధకులు ప్రకటించారు. కానీ, ఎరిత్రిటోల్లోని ఏ పదార్థం ఈ సమస్యలకు కారణమవుతుందన్న విషయాన్ని నిరూపించలేకపోయారు. దీంతో ప్రమాదమని తెలిసినా వీటి అమ్మకాన్ని అడ్డుకొనే అవకాశం లేకుండా పోతున్నదని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైపై పరిశీలనతోనే ప్రమాదకర ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులు ఇస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. ఈ చక్కెరలను ఉత్పత్తి చేసేదీ.. వినియోగించేది పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలే. ఆ సంస్థల ఒత్తిడికి తలొగ్గి కేంద్రం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నదని శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు.