LPG Price Hike | న్యూఢిల్లీ, మార్చి 5: గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను ఆకాశంలో కూర్చోబెట్టిన కేంద్ర ప్రభుత్వం, దానిపై పేదలకు ఇచ్చే సబ్సిడీని పాతాళంలోకి నెట్టేసింది. ఈ నెల ఒకటిన పెంచిన ధరతో కలిపి ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ ధర రూ.1,155కు చేరింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన 2019 తర్వాత నుంచి గ్యాస్ ధర దాదాపు 56 శాతానికి పైగా పెరిగింది. ఇదే సమయంలో గ్యాస్ సబ్సిడీకి మాత్రం కేంద్రం విపరీతంగా నిధుల కోత పెట్టేసింది. 2018-19లో సబ్సిడీ కోసం రూ.37 వేల కోట్లకు పైగా కేటాయించగా.. 2019-20లో రూ.24 వేల కోట్లకు తగ్గించింది. 2020-21లో రూ.12 వేల కోట్లకు, 2021-22కి వచ్చేసరికి దారుణంగా రూ.1,811 కోట్లకు తగ్గించింది.
గ్యాస్ ధరలను కేంద్రం నిత్యం ప్రతి ఏడాది భారీగా పెంచుతూ వచ్చింది. 2019 నుంచి 2023 వరకు మధ్య నాలుగేండ్ల వ్యవధిలో ఏడు సార్లు ఎల్పీజీ ధరలు పెరిగాయి. 2019లో రూ.701గా ఉన్న 14.2 కేజీల గ్యాస్ ధర ఇప్పుడు రూ.1,155 వద్ద కొండెక్కి కూర్చున్నది. 2020లో రూ.746కి చేరిన గ్యాస్ సిలిండర్ ధర.. 2021లో రెండుసార్లు పెరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో రూ.821, అక్టోబర్లో రూ.952కి చేరింది. గత ఏడాది పలుమార్లు గ్యాస్ సిలిండర్ ధర పెంపు కారణంగా.. ఏప్రిల్లో రూ.1,002, మే నెలకు రూ.1,055, జూలైకి రూ.1,105కి ఎగబాకింది. ఇంత పెంచినా గ్యాస్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని చెప్తూ, ప్రభుత్వ రంగ ఓఎంసీలకు కేంద్రం ఇటీవలే రూ.2,2000 కోట్లు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది.