న్యూఢిల్లీ, జూన్ 16: మరో పేరు మార్పు వివాదానికి కేంద్రం తెరతీసింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్మూర్తి భవన్ ప్రాంగణంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ హౌస్ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం అల్పబుద్ధితో ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ మండిపడింది. పేర్ల మార్పుతో దేశ వారసత్వ సంపదను నాశనం చేయవద్దంటూ హితవు పలికింది. కేంద్ర మంత్రి, ఎన్ఎంఎంఎల్ ఉపాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పేరుమార్పునకు తీర్మానం జరిగినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ శుక్రవారం తెలిపింది.
సమావేశంలో రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘నెహ్రూ మొదలుకుని మోదీ వరకు తమ పాలనలో ఎదుర్కొన్న సవాళ్లు, వారి సామర్ధ్యానికి సాక్షీభూతంగా నిలిచిన ఈ లైబ్రరీ సేవలను దృష్టిలో ఉంచుకుంటే పేరు మార్పు ఆహ్వానించదగినదే’ అని వ్యాఖ్యానించారు. అల్ప బుద్ధికి, ప్రతీకారానికి ప్రధాని మోదీ మారుపేరుగా నిలిచారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ఎన్నో ఏండ్లుగా వేలాది పుస్తకాలు, ఇతిహాసాలకు సంపదగా భాసిల్లుతున్న ఎన్ఎంఎంఎల్ పేరు ప్రతిష్టలను నాశనం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తనకు తాను విశ్వగురుగా అభివర్ణించుకునే మోదీ అభద్రతా భావంతో ఇలాంటి అల్ప పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్రం చర్యను కాంగ్రెస్ ఇతర నేతలు ఖండించారు.