Cheetah | న్యూఢిల్లీ: దేశంలో చీతాలే లేవని, విదేశాల నుంచి రప్పిస్తున్నామని కేంద్రం గొప్పలు చెప్పుకొన్నది.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతలుగా 20 చీతాలను తీసుకొచ్చింది. అయితే వాటిలో ఇప్పటికే రెండు చీతాలు మరణించడం చర్చనీయాంశమైంది. అసలు భారత వాతావరణం, ఇతర పరిస్థితులను అంచనా వేయకుండానే మోదీ సర్కార్ విదేశాల నుంచి చీతాలను దేశానికి తీసుకొచ్చిందా? అనే చర్చ నడుస్తున్నది. చీతాలను కునో పార్కులో విడుదల చేసే సమయంలో ఫొటోషూట్ చేసిన ప్రధాని మోదీ.. ఇప్పుడు వాటి మరణాలపై మాట్లాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
చీతాల మరణాలపై దక్షిణాఫ్రికా అటవీ, మత్య్స, పర్యావరణశాఖ కీలక ప్రకటన చేసింది. చీతాల మరణాలను ముందే ఊహించామని వెల్లడించింది. భారత వాతావరణం వాటికి క్లిష్టమైనదని వివరించింది. ‘పెద్ద మాంసాహార జంతువులను పునఃప్రవేశపెట్టడం తీవ్ర సంక్లిష్టమైన చర్య. అది ప్రమాదకరం. చీతాల పునఃప్రవేశ ప్రాజెక్టులో వాటికి గాయాలు కావడం, మరణాలు సంభవించడం వంటివి జరుగుతాయి. చీతాలను పెద్ద ఆవరణలోకి వదలడమనేది కీలకమైన దశ. ఈ సమయంలో చీతాల రోజూవారీ సంరక్షణపై నియంత్రణ తగ్గుతుంది’ అని పేర్కొన్నది. కునో నేషనల్ పార్కు కంచె లేని రక్షిత ప్రాంతమని తెలిపింది. చీతాలు వాటి పరిధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత పరిస్థితి సద్దుమణుగుతుందని, ప్రమాదం తగ్గుతుందని వెల్లడించింది.