కోల్కతా: వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్వరుల్ను హత్య చేయడానికి అతని స్నేహితుడే రూ.5 కోట్లకు సుపారీ ఇచ్చాడని సీనియర్ పోలీస్ అధికారి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఆ వ్యక్తికి కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ఒక ఫ్లాట్ కూడా ఉందని చెప్పారు.
ఈ ఫ్లాట్లోనే రక్తపు మరకలు, కొన్ని ప్లాస్టిక్ సంచులను దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఎంపీని తొలుత గొంతు పిసికి హత్య చేసి తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి బ్యాగ్లలో తరలించి వివిధ ప్రదేశాల్లో పారవేసినట్టు భావిస్తున్నామని సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది తెలిపారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిపిన హత్య అని, ఎంపీని చంపమని అతని స్నేహితుడే రూ.5 కోట్ల సుపారీ ఇచ్చారని చెప్పారు.