(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ):‘గత మూడేండ్లలో మనం చేపట్టిన అభివృద్ధి పనులు ఏమున్నయ్? పైగా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా చాలావరకూ నిజమే. ఈ ట్రాక్ రికార్డుతో ప్రజల ముందుకు వెళ్తే తప్పకుండాఛీకొడతారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనం అధికారంలోకి రావాలంటే హిందూత్వ ఎజెండాను రెచ్చగొట్టడం ఒక్కటే మార్గం’ ఇటీవల జరిగిన కర్ణాటక బీజేపీ అంతర్గత సమావేశంలో ఓ సీనియర్ మంత్రి వెలిబుచ్చిన అభిప్రాయమిది. అధికారంలోకి రావడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ, ఆరెస్సెస్కూ కొత్తేమీ కాదు. కమీషన్ రాజ్, లంచం రేటు కార్డు వంటి వివాదాలతో ఇప్పటికే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన బసవరాజు బొమ్మై సర్కారుకు వచ్చే ఏడాది మేలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. దీంతో బీజేపీ రాష్ట్ర పెద్దలు యుద్ధప్రాతిపదికన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ను నిర్వహించారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై లోతుగా చర్చించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతి వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టాన్ని కలిగించవచ్చని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో అభిప్రాయపడ్డారు.
యెడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడే లంచాలు పెరిగిపోయాయని బొమ్మై అనుకూలవర్గం ఆరోపించగా, యెడ్డీ వర్గం దాన్ని తోసిపుచ్చింది. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. ఎన్నికల్లో విజయం సాధించడానికి ‘ప్లాన్-బీ’ గురించి ఆలోచించాలని అధిష్ఠాన పెద్దలు పురమాయించారు. ఈ క్రమంలో ఓ సీనియర్ మంత్రి మాట్లాడుతూ.. హిజాబ్, హలాల్, మసీదుల్లో లౌడ్స్పీకర్ల వంటి వివాదాలు బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న హిందువులపై పెద్ద ప్రభావమే చూపినట్టు తెలిపారు. అభివృద్ధి తదితర అంశాలపై కాకుండా హిందూత్వ ఎజెండాపై ముందుకెళితే ఎన్నికల్లో మంచి ఫలితాలు రావొచ్చని సలహా ఇచ్చారు. పలువురు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇదే సూచన చేశారు. దీనిపై పార్టీ, ఆరెస్సెస్ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. దీంతో రానున్న రోజుల్లో కర్ణాటకను మత వివాదాలు మళ్లీ కుదిపేయవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.