కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనకు అనుకూలమైన తీర్మానాలు చేయించుకోడానికి లోయలో కొత్త కొత్త పార్టీలను సృష్టిస్తోందని ఆరోపించారు. బందిపోరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒమర్ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం లాంటి విషయంలో తమకు అనుకూలంగా తీర్మానాలు చేయించుకోడానికి బీజేపీ కొత్త పార్టీలను పుట్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికలు జరిగినప్పుడు తమకు తగినంత మెజారిటీ రాదన్న విషయం బీజేపీకి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. కొత్త కొత్త పార్టీలను సృష్టించి, సంపాదించుకున్న మెజారిటీ ద్వారా గతంలో చేసిన తీర్మానాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఆ తర్వాత సుప్రీంకు వెళ్లి, తమ తీర్మానాలకు ప్రజల ఆమోదం ఉందని చెబుతారని, దీని ద్వారా సుప్రీం కూడా ఓకే అన్న పరిస్థితిని తెచ్చుకుంటారని ఒమర్ ఆరోపించారు.